news18-telugu
Updated: October 10, 2020, 8:42 PM IST
ప్రతీకాత్మక చిత్రం
భారత్ - చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి 60,000 మందికి పైగా సైనికులను చైనా మోహరించిందని అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో భారత్ దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో భారత్కు అమెరికా అవసరం ఉందన్నారు. ‘క్వాద్’ దేశాలకు (అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా) చెందిన విదేశాంగ మంత్రుల సమావేశం టోక్యోలో జరిగింది. ఈ సందర్భంగా పాంపియో మాట్లాడుతూ చైనా ప్రవర్తన ఏమాత్రం బాగో లేదని, ‘క్వాద్’ దేశాలను కూడా భయపెడుతోందని మండిపడ్డారు. చైనాతో క్వాద్ దేశాలతో ప్రమాదం నెలకొని ఉందని.. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ‘చైనాను చూసీచూడనట్లు వదిలేశామని క్వాద్ ప్రజలు భావిస్తున్నారు. మునుపటి ప్రభుత్వాలు కూడా దశాబ్దాల పాటు చైనా చేష్టలను చూస్తూ ఉండిపోయాయి. మన మేథో సంపత్తిని, ఉద్యోగాలను తీసుకెళ్తున్నా చూసీ చూడనట్లు ఉండిపోయాయి. వారి వారి దేశాల్లో కూడా ఇలాగే జరిగినా మిన్నకుండిపోయాయి’ అని పాంపియో మండిపడ్డారు. భారత్కు వ్యతిరేకంగా చైనా అధిక సంఖ్యలో సైనికులను మోహరిస్తోందని, ఈ సమయంలో అమెరికా స్నేహం భారత్కు అత్యంత అవసరం అని పాంపియో అన్నారు.
ఇండో-పసిఫిక్, దక్షిణ చైనా సముద్రంలో, తూర్పు లడఖ్లోని ఎల్ఏసీ వెంట చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత్లోని వాస్తవాధీన రేఖ వెంట చైనా తీరు సరిగా లేదని.. కుట్రలు చేస్తోందని పాంపియో విమర్శించారు. సుమారు 60 వేల మంది చైనా సైనికులు ఉత్తర భారత సరిహద్దుల్లో మోహరించి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
‘ఇప్పుడు ప్రపంచం మేలుకుంది. పరిస్థితులు మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సారధ్యంలో కొత్త సయోధ్యను కుదుర్చుకుని వారిని వెనక్కి పంపాలి. రూల్ ఆఫ్ లా, ఆర్డర్ మెయింటెయిన్ చేయడానికి ఇది అవసరం. ఇది ప్రజాస్వామ్య దేశాలు చేయాల్సిన పని.’ అని అన్నారు. ఫాక్స్ న్యూస్తో మాట్లాడిన పాంపియో ‘వారు 60,000 మందిని మోహరించారు. భారత్కు వ్యతిరేకంగా ఉత్తర భాగంలో. వుహాన్ వైరస్ అది ఎక్కడైతే ప్రారంభమైందో దాని గురించి నిజాలు తేల్చాల్సి ఉందని ఆస్ట్రేలియా అడిగినప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ భయపెట్టే ప్రయత్నం చేసింది. ఒత్తిడి చేసింది. మాకు భాగస్వాములు, స్నేహితులు కావాలి. వారు (చైనా) కచ్చితంగా స్పందిస్తారు. తప్పుడు ప్రవర్తనను ప్రోత్సహస్తారు. వారి చర్యలు కొనసాగిస్తారు. వారికి తెలుసు. మనం సీరియస్గా ఉన్నామని. కచ్చితంగా వారిని నిరోధిస్తామని, వారికి మూల్యం చెల్లిస్తామని తెలుసు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని నేను ధీమాగా ఉన్నాను. దీని వల్ల అమెరికాకు నష్టం చేయాలన్న చైనా కమ్యూనిస్టు పార్టీ విధానం కూడా మారుతుంది.’ అని పాంపియో అన్నారు.
భారత్, చైనా మధ్య ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. గాల్వన్ లోయలో భారత్, డ్రాగన్ బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, చైనాకు సంబంధించి ఎంతమంది చనిపోయారనే విషయాన్ని ఆ దేశం చెప్పలేదు. కానీ, 35 మందికి పైగా చనిపోయి ఉంటారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా చైనా దుందుడుకు చర్యలను కొనసాగిస్తోంది. సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తోంది. దీంతో భారత్ కూడా అందుకు దీటుగా సన్నద్ధం అవుతోంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 10, 2020, 8:41 PM IST