భారత్తో పోల్చితే... రెట్టింపు భూభాగం ఉన్నప్పటికీ... చైనా ఇప్పటికీ... భారత భూభాగాన్ని లాక్కోవడానికే కుట్రలు పన్నుతోంది. ఎప్పుడు చాన్స్ దొరుకుతుందా... ఎప్పుడు ఏ రాష్ట్రాన్ని లాగేసుకుందామా అని డ్రాగన్ ఎదురుచూస్తోంది. గత 50 ఏళ్లుగా ఈ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ (LAC)ను చెరిపేస్తూ... బీజింగ్ సైన్యం... మన దేశంలోకి చొచ్చుకొస్తూనే ఉన్నారు. ఎల్ఏసీ దగ్గరున్న తూర్పు, పశ్చిమ సెక్టార్లలోని మొత్తం 8 సరిహద్దు ప్రాంతాలు తమవేనని చైనా అంటోంది. రూల్ ప్రకారం... రెండు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) పొడవు 3,440 కిలోమీటర్లు. ఇది తూర్పు, మధ్య, పశ్చిమ సెక్టార్లుగా మూడు భాగాలుగా ఉంది. చాలా చోట్ల ఎల్ఏసీ కచ్చితంగా ఎలా ఉంది అనే దానిపై క్లారిటీ లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని చైనా దురాక్రమణలకు దిగుతోంది.
పశ్చిమ సెక్టార్పై డ్రాగన్ కన్ను - 1570 కిలోమీటర్లు :
కారకోరం కనుమ వాయవ్య ప్రాంతం నుంచి దెమ్చోక్ దాకా ఇది ఉంది. ఎక్కువగా లడక్ సరిహద్దుగా ఉంది. ఇందులో అక్సాయ్చిన్ భాగంగా ఉంది. ఇది మనదే అని భారత్ అంటుంటే... తమదే అని చైనా అంటోంది. 1962లో అక్సాయ్చిన్లో ఓ రోడ్డును టిబెట్లోని ఝింజియాంగ్కు చైనా నిర్మించింది. ఇక లడక్లోనే ఉన్న దెమ్చోక్ గ్రామంలో కూడా చైనా, భారత్ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
తూర్పు సెక్టార్ - 1325 కిలోమీటర్లు :
సిక్కిం నుంచి మయన్మార్ సరిహద్దు దాకా ఇది ఉంది. ఇందులోనే అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్రం తమదేనని చైనా అంటోంది. ఇక్కడి అసాఫిలా ప్రాంతంలో 1962లో చైనా యుద్ధానికి దిగింది. ఇక లోంగ్జూ, నమ్కా చూ నదీ లోయ, సుమ్దోరాంగ్ చూ, యాంగ్జేలో రెండు దేశాల మధ్యా 1962 నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
మధ్య సెక్టార్ - 545 కిలోమీటర్లు :
దెమ్చోక్ నుంచి నేపాల్ సరిహద్దు దాకా ఉన్న ప్రాంతం ఇది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఉంది. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మైదానాలు ఈ ప్రాంతంలోకి వస్తాయి. చైనా బలగాలు చాలాసార్లు ఇక్కడ చొరబడ్డాయి.
గాల్వాన్ లోయ :
అక్సాయిచిన్ నుంచి భారత్లోని లడక్ దాకా గాల్వాన్ నది ఉంది. 1962లో రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఈ నదీ లోయ కీలకంగా మారింది. అక్సాయిచిన్ మాదే అని భారత్ అంటుంటే... గాల్వాన్ నది పశ్చిమంవైపు దాకా తమదేనని చైనా అంటోంది.
దౌలత్ బేగ్ ఓల్డీ :
అక్సాయిచిన్కు ఇది దగ్గర్లోనే ఉంది. ఇక్కడ ఇండియాకి చెందిన కార్గో విమానం 2008లో దిగినపుడు చైనా మండిపడింది. ఇది భారత్కు వ్యూహాత్మక ప్రాంతం. 1962 యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్యా ఇది సమస్యాత్మక ప్రాంతంగా మారింది.
ప్యాంగాంగ్ సరస్సు :
ఇది తూర్పు లడక్లోని హిమాలయాల్లో సముద్ర మట్టానికి 14000 అడుగుల ఎత్తులో ఉంటూ... 135 కిలోమీటర్లు ఉన్న సరస్సు. 1962లో చైనా యుద్ధాన్ని ఇక్కడి నుంచే చేసింది. పాంగాంగ్ సరిహద్దు దాకా చైనా తన రోడ్లను నిర్మించింది. భారత్పై దాడికి దిగేందుకు ఇది సరైన ప్రదేశం అని చైనా భావిస్తోంది.
1962 యుద్ధం తర్వాత నుంచి చైనా... సరిహద్దు భూభాగాల్ని ఆక్రమించుకుంటూనే ఉంది. చాలా సందర్భాల్లో చైనా వల్ల ఉద్రిక్తతలు తలెత్తాయి. 2013లో 19 కిలోమీటర్లు భారత్లోకి చొచ్చుకువచ్చింది. అప్పుడు ఇండియా 640 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయింది. ఈ వాదనను చైనా ఖండిస్తోంది.
లడక్ను మోదీ ప్రభుత్వం... కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. లడక్లో కొంత భూభాగం తమదేనంటున్న చైనా... భారత్ నిర్మయంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో కంప్లైంట్ చేసింది. ఇప్పుడు భారత్, అమెరికా దగ్గరవుతుండటాన్ని సహించలేక చైనా... కుయుక్తులకు పాల్పడుతోంది. ఓవైపు నేపాల్ని రెచ్చగొడుతూ... మరోవైపు సరిహద్దుల్లో చొరబాట్లకు పాల్పడుతోంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.