కొవిడ్ (Covid-19) సమయంలో కొన్ని ప్రాంతాల్లో వన్యప్రాణులు కూడా కరోనా బారిన పడ్డాయి. ఆ సమయంలో వన్యప్రాణుల అక్రమ తరలింపుపై, జూనోటిక్ వ్యాధుల (Zoonotic diseases)పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. 2020 జూన్లో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఎక్సోటిక్ యానిమల్స్ (Exotic Animals) దిగుమతి, స్వాధీనం చేసుకొనే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఓ అడ్వైజరీని ఏర్పాటు చేసింది. పెంపుడు జంతువులు కాని, విదేశాలకు చెందిన జాతులను ఎక్సోటిక్ యానిమల్స్గా పేర్కొంటారు.ఎక్సోటిక్ యానిమల్స్ దిగుమతి చేసుకునే వ్యక్తులు స్వచ్ఛందంగా బహిర్గతం చేయవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల మంత్రిత్వ శాఖ అడ్వైజరీని ఏర్పాటు చేయడాన్ని సమర్థించింది. ఈ క్రమంలో దాని చిక్కులు, ప్రాముఖ్యత, భారతదేశంలో జంతువుల అక్రమ రవాణాపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి..
* ఎక్సోటిక్ లివ్ స్పీసెస్ అంటే ఏంటి?
మంత్రిత్వ శాఖ ప్రకారం.. విదేశాల నుంచి తరలించే జంతు లేదా వృక్ష జాతులను ఎక్సోటిక్ లివ్ స్పీసెస్ అంటారు. ది హిందూ ప్రకారం.. ఇతర దేశాల నుంచి అనేక జాతుల పక్షులు, సరీసృపాలు, చిన్న క్షీరదాలు, చేపలు, కొన్ని మొక్కలు కూడా దిగుమతి అవుతాయి. వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరాకి చెందిన అంతరించిపోతున్న జాతుల అంతర్జాతీయ వాణిజ్యం(CITES)లోని అనుబంధాలు I, II, III కింద పేర్కొన్న జంతువులను మాత్రమే ఎక్సోటిక్ యానిమల్స్గా మంత్రిత్వశాఖ పేర్కొంది.
* మంత్రివర్గం ఎందుకు అలాంటి చర్య తీసుకుంది?
భారతదేశంలో చాలా మంది వ్యక్తులు అంతరించిపోతున్న జాతుల అంతర్జాతీయ వాణిజ్యం(CITES) కిందకి వస్తారు. అయితే రాష్ట్ర లేదా కేంద్ర స్థాయిలో అటువంటి జాతులను కలిగి ఉండే వారి వివరాలను పర్యవేక్షించేందుకు యూనిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అందుబాటులో లేదు.
* అడ్వైజరీ ఏం చెబుతోంది?
- వచ్చే ఆరు నెలల్లో ఎక్సోటిక్ యానిమల్స్ ఉన్న వారు స్వచ్ఛందంగా వివరాలు వెల్లడిస్తే పర్యావరణ మంత్రిత్వ శాఖ సమాచారాన్ని సేకరిస్తుంది.
- జంతువులను ఉంచుకోవడానికి, కొత్త సంతానం, అలాగే దిగుమతి, మార్పిడి కోసం రిజిస్ట్రేషన్ చేస్తుంది.
- ఇది జాతుల మెరుగైన నిర్వహణలో సహాయపడుతుంది. సరైన పశువైద్య సంరక్షణ, నివాసం, జాతుల శ్రేయస్సు ఇతర అంశాల గురించి మార్గనిర్దేశం చేస్తుంది.
- ఎక్సోటిక్ యానిమల్స్ డేటాబేస్ జూనోటిక్ వ్యాధుల నియంత్రణ, నిర్వహణలో కూడా సహాయపడుతుంది. జంతువులు, మానవుల భద్రతను నిర్ధారించడానికి ఎప్పటికప్పుడు గైడెన్స్ అందుబాటులో ఉంటుంది.
- అడ్వైజరీ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలలలోపు డిక్లరర్ ఎక్సోటిక్ యానిమల్స్కు సంబంధించి ఎలాంటి డాక్యుమెంటేషన్ను సమర్పించాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది.
- ఆరు నెలల తర్వాత చేసిన ఏదైనా డిక్లరేషన్ కోసం, డిక్లరర్ ప్రస్తుతం ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం డాక్యుమెంటేషన్కు అనుగుణంగా ఉండాలి.
- అటువంటి జాతులను కలిగి ఉన్నవారు స్టాక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వెబ్సైట్ (www.parivesh.nic.in)ని సందర్శించి, అవసరమైన ఫారమ్లను పూరించాలి.
- ఎవరైనా ఎక్సోటిక్ యానిమల్స్ను దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)కి లైసెన్స్ కోసం దరఖాస్తును సమర్పించాలి.
- దిగుమతిదారు అప్లికేషన్తో పాటు సంబంధిత రాష్ట్ర చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)ని కూడా జతచేయాలి.
* అడ్వైజరీ అడ్డంకులు, ప్రాముఖ్యత ఏంటి?
ఇండియా స్పెండ్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించేందుకు 2021 మార్చి 15ను అడ్వైజరీ గడువుగా పేర్కొంది. ఆమ్నెస్టీ స్కీమ్ కింద 30,000 మందికి పైగా భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు.
వైల్డ్లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కోసం వన్యప్రాణుల నేర నిరోధక విభాగానికి నాయకత్వం వహిస్తున్న జోస్ లూయిస్ మాట్లాడుతూ..‘ఈ చర్య వన్యప్రాణుల వ్యాపారంలో ఒక డిసేబుల్ అవుతుంది. ఎక్సోటిక్ యానిమల్స్ పెద్ద సమస్యగా మారాయి. వాటిని అడవిలో వదిలేస్తే ఇక్కడి పర్యావరణ అసమతుల్యత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. CITES కింద పేర్కొన్న జంతువులను రాష్ట్ర అటవీ శాఖ పరిశీలించడం ఇదే మొదటిసారి.
CITES నియమాన్ని అనుసరించి జంతువులు దిగుమతి చేసుకుంటున్నారా? లేదా? అనేది తనిఖీ చేయడానికి ఇంతకు ముందు కస్టమ్స్ అధికారులను పరిమితం చేశారు. CITES అనుబంధం III కింద పేర్కొన్న జంతువులు కస్టమ్స్ పాయింట్ను దాటిన తర్వాత డిపార్ట్మెంట్కు ఎటువంటి పాత్ర ఉండదు.
అక్రమ పెంపుడు జంతువుల వ్యాపారాన్ని నియంత్రించడంలో ఇది మొదటి అడుగు. పెంపుడు జంతువుల దుకాణాలపై ఇప్పటివరకు అటవీ అధికారులకు ఎటువంటి నియంత్రణ లేదు, ఎందుకంటే యజమానులు అవి భారతీయ జాతులు కాదని, వన్యప్రాణి సంరక్షణ చట్టం కిందకు రావని చెబుతారు.’ అని అన్నారు.
* భారతదేశంలో జంతువుల అక్రమ రవాణా
ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ భారతదేశంలో వన్యప్రాణుల అక్రమ రవాణా కొనసాగుతోంది. జూన్లో ఉత్తర బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి మూడు కంగారూలను రక్షించారు. జంతువులను దేశంలోకి ఎలా తీసుకువచ్చారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న జంతువులను రక్షించడానికి భారతదేశానికి బలమైన చట్టాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
CITESలో భాగంగా ఉన్నప్పటికీ, భారతదేశం ప్రస్తుతం వన్యప్రాణుల అక్రమ రవాణాలో మొదటి 20 దేశాలలో ఉంది. 2020 వరల్డ్ వైల్డ్లైఫ్ రిపోర్ట్ మేరకు.. 1999 నుంచి 2018 మధ్య 6,000 రకాల వృక్షజాతులు, జంతుజాలాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
2011 నుంచి 2020 మధ్యకాలంలో 18 భారతీయ విమానాశ్రయాల ద్వారా 70,000 పైగా స్థానిక, ఎక్సోటిక్ యానిమల్స్ అక్రమ రవాణా అయ్యాయని UNEP భాగస్వామి TRAFFIC, వన్యప్రాణుల వాణిజ్య పర్యవేక్షణ ఏజెన్సీ తాజా నివేదిక పేర్కొంది.
వన్యప్రాణుల అక్రమ రవాణాకు ఎయిర్లైన్ రంగాన్ని ఉపయోగించుకునే విషయంలో మొదటి పది దేశాలలో భారతదేశం ఒకటి అని UNEP అధిపతి అతుల్ బగాయ్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Animals, Central Government, National News, Supreme Court