HERE ARE THE REASONS FOR GOVERNMENT REDUCING THE LIQUOR PRICE AND RESUMING SALES OF OLD BRANDS IN ANDHRA PRADESH PRN GNT
Explainer: ఏపీలో మద్యం ధరల తగ్గింపు వెనుక కారణాలివేనా..? పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది..?
liqour shop file photo
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ ప్రభుత్వం (YSRCP) ఏర్పడిన తర్వాత నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి దుకాణాల సంఖ్య తగ్గించారు. ఈ దుకాణాలను కూడా ప్రభుత్వం తన ఆధ్వర్యంలోనే నడుపుతోంది. పాత బ్రాండెడ్ మద్యానికి బదులు స్థానిక మద్యం బ్రాండ్లను అమ్మకానికి ఉంచింది.
"మద్యపానం వలన బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలు ఛిద్రమౌతున్నాయి,అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తమప్రభుత్వం అధికారంలోకి రాగానే దశలవారీగా మద్యపాన నిషేదం అమలు చేస్తాం. ఐదేళ్ళలో మన రాష్ట్రంలో పూర్తిగా మధ్యం అన్న మాటే వినపడకుండా చేస్తాం."ఇది అప్పుడు ప్రతిపక్షనేతగా ఇప్పుడు సీఎంగా జగన్ ప్రజలకు ఇచ్చిన హామీ. ఐతే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి దుకాణాల సంఖ్య తగ్గించారు. ఈ దుకాణాలను కూడా ప్రభుత్వం తన ఆధ్వర్యంలోనే నడుపుతోంది. పాత బ్రాండెడ్ మద్యానికి బదులు స్థానిక మద్యం బ్రాండ్లను అమ్మకానికి ఉంచింది. మద్యం వినియోగం తగ్గించేందుకు రేట్లు పెంచుతున్నామంటూ భారీగా ధరలు పెంచింది. ఐతే ఇటీవల ధరలు తగ్గించడమే కాకుండా.. బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వ ఆదాయంలో మద్యం పాత్ర ఏమిటి..?
ప్రస్తుత పరిస్థితులలో ఏ ప్రభుత్వానికైనా ప్రధాన ఆదాయవనరు మద్యం పై వచ్చే ఆదాయమే అనేది బహిరంగ రహస్యం. ఆ ఆదాయంతోనే చాలావరకు ప్రభుత్వాలు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటాయి. అటువంటిది మద్యపాన నిషేధం అమలు చేయడం అంటే సాహసం అనే చేప్పాలి.
మద్యపాన నిషేదం దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి..?
జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో అప్పటి వరకూ ఉన్న వైన్ షాపులను 25% వరకు తగ్గించారు. ఆ తరువాత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే మధ్యం ఎంఆర్పీ ధరలకంటే అధికంగా వసూలు చేస్తున్నారంటూ వాటిని ప్రభుత్వమే నడపాలని నిర్ణయించి అమలు చేశారు. వీటిలో పని చేయడానికి సిబ్బందిని నియమించారు. మద్యం ధరలను ఒక్కసారిగా 50% నుండి 75% వరకు పెంచేశారు. అప్పటి వరకు అందుబాటులో ఉన్న బ్రాండ్ లను కాదని కొత్త కొత్త బ్రాండ్ లను ప్రవేశపెట్టారు. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమమద్యం సరఫరా కాకుండా స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను అందులో విలీనం చేశారు.
మందుబాబుల స్పందన ఏంటి..?
ఈ పరిణామాలతో ఖంగుతిన్న మందు బాబులు అక్రమమార్గాలను ఎంచుకున్నారు. కొందరు అక్రమార్కులు ప్రక్కరాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరుకుతున్న మద్యం బ్రాండ్ లను ఇక్కడికి తీసుకు వచ్చి విక్రయించడం మొదలుపెట్టారు. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కొందరు అక్రమమద్యం వ్యాపారులకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించారనే ప్రచారమూ లేక పోలేదు. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో నాటు సారా తయారీ ఊపందుకుంది. దీంతో మద్యంపై వచ్చే ఆదాయానికి భారీగా గండిపడింది. అసలే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి ఇప్పుడు మద్యంపై ఆదాయం కూడా భారీగా తగ్గడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.
ఉన్నట్లుండి ధరలు తగ్గించడానికి కారణాలేంటి..?
ప్రస్తుత పరిస్థితుల్లో చేసేదేంలేక జగన్ ప్రభుత్వం మద్యం పాలసీని పునః సమీక్షించి ధరలను 20% మేర తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట్లో జగన్ మద్యపాన నిషేధం అంటూ తీసుకున్న నిర్ణయాలపై ప్రజల మద్దతు కూడా ఉంది అనే చెప్పాలి. ఆ తర్వాతి కాలంలో ధరలు పెంచినా తమకు కావలసిన బ్రాండ్ మద్యం దొరక్క,వైన్ షాపులలో దొరికే మద్యంలో నాణ్యత లేకపోవడంతో మద్యపాన ప్రియులు అక్రమ మద్యంవైపు అడుగులు వేశారు. దీనిని ఆసరాగాచేసుకుని కొందరు ప్రజాప్రతినిధులు స్వయంగా తమ అనుచరులతో తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తెప్పించి సొమ్ముచేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో సాధారణంగానే ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై ఒత్తిడులు మొదలయ్యాయి. మొదట్లో హడావిడి చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిడిలకు తలొగ్గక తప్పలేదు. దీంతో అక్రమ మద్యం రాష్త్రంలో ఏరులై పారింది. ఆయాపరిణామాలన్నింటిని గమనించిన ప్రభుత్వ పెద్దల సలహా మేరకు మధ్యం ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
.ప్రతిపక్షాలు ఏమంటున్నాయ్ ..?
ఐతే ప్రభుత్వం ధరలు తగ్గించినప్పటికీ సరిహద్దు రాష్ట్రాలతో పోల్చుకుంటే 10% పైనే వ్యత్యాసం ఉందని పైగా మన రాష్ట్రంలో దొరికే మద్యం అంతగా నాణ్యత లేదని వినియోగదారుల వాదన. గతంలో దొరికిన బహుళజాతి కంపెనీల మధ్యం బ్రాండ్ లు ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించనందునే వాటిని రాష్ట్రం లోకి అనుమతించకుండా లోకల్ మేడ్ మధ్యం మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారని, ఆయా మధ్యం తయారీ వ్యాపారం వెనుక అధికారపార్టీ నాయకుల హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమ మధ్యాన్ని అరికట్టడం చేతగాక మధ్యం రేట్లు తగ్గిస్తున్నామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన పై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.నాటుసారా తయారీ,అక్రమ మద్యం సరఫరాని అరికట్టడంచేతగాని వైసీపీ ప్రభుత్వం రేపు సంపూర్ణ మద్యపాన నిషేధం ఏవిధంగా అమలు చేస్తుంది అనేది ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలి తప్ప ఇలా మద్యం ధరలు తగ్గించడం ద్వారా ఏవిధంగా మధ్యపాన నిషేధం అమలు చేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
జగన్ తన తొందరపాటు నిర్ణయాలతో ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని.., జగన్ అవగాహన లేమి వల్ల రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడిపోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.