ఉత్తరప్రదేశ్(Uttara Pradesh) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. రాష్ట్రంలో తమ పార్టీ నుంచి అభ్యర్థులను బరిలో దింపారు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owasi). ప్రచారంలో భాగంగా ఆయన కూడా వివిధ ప్రాంతాలను చుట్టివస్తున్నారు. ఈ క్రమంలో హాపూర్లో అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో ఉండగా కొందరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపారని ఆయన గురువారం తెలిపారు. దీంతో ఘటన జరిగిన ఒకరోజు తర్వాత CRPF కమాండోలతో ఒవైసీకి 'Z' కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అసలు 'Z' కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏంటి? ఎలాంటి సందర్భంలో ఎవరెవరికి ఇలాంటి సెక్యూరిటీ కల్పిస్తారు? వంటి విషయాలు తెలుసుకుందాం.
‘Z’ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏంటి?
భారతదేశంలో హై-రిస్క్ ఉన్న వ్యక్తులకు పోలీసులు, స్థానిక ప్రభుత్వం మెరుగైన భద్రత కల్పిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW) వంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి అందిన ఇన్పుట్ల ఆధారంగా, అవసరమైన వ్యక్తులకు సెక్యూరిటీ కల్పిస్తారు. ఈ భద్రత స్థాయిని హోం శాఖ నిర్ణయిస్తుంది. ప్రధానమంత్రి, హోం మంత్రి వంటి వ్యక్తులు, జాతీయ భద్రతా సలహాదారు వంటి హై రేంజ్ వ్యక్తులు, కీలకమైన ఉన్నతాధికారులకు హై రేంజ్ సెక్యూరిటీ అవసరమవుతుంది.
దీంతో పాటు ముప్పు ఉందని భావించే కొందరు ప్రముఖులకు కూడా భద్రతను పెంచుతారు. భారతదేశంలో సెక్యూరిటీ లెవల్ను X, Y, Y-plus, Z, Z-plus, SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కేటగిరీలుగా వర్గీకరించారు. SPG కవరేజ్ ప్రధానమంత్రి, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉంటుంది. X కేటగిరీ సెక్యూరిటీలో.. వ్యక్తులకు ఒక గన్మ్యాన్ను కేటాయిస్తారు. Y కేటగిరీలోని వారికి మొబైల్ సెక్యూరిటీ కోసం ఒక గన్మ్యాన్, స్టాటిక్ సెక్యూరిటీ కోసం మరొకరిని.. మొత్తం ఇద్దరిని (రొటేషన్ కోసం మరో నలుగురు ఉంటారు) కేటాయిస్తారు.
Y-ప్లస్ కేటగిరీలో ఉన్నవారికి మొబైల్ సెక్యూరిటీ కోసం ఇద్దరు గన్మెన్లు ఉంటారు(రొటేషన్ కోసం మరో నలుగురు ఉంటారు). దీంతోపాటు ఇంటి భద్రత లేదా రెసిడెన్స్ సెక్యూరిటీ కోసం ఒకరు (ప్లస్ నలుగురు రొటేషన్) ఉంటారు. అయితే Z కేటగిరీలో మొబైల్ సెక్యూరిటీ కోసం ఆరుగురు గన్మెన్లు, రెసిడెన్స్ సెక్యూరిటీ కోసం మరో ఇద్దరు (రొటేషన్ కోసం మరో 8 మంది) ఉంటారు. నలుగురు లేదా ఐదుగురు NSG కమాండోలు, పోలీసులతో కలిపి మొత్తం 22 మంది సిబ్బందిని ఈ కేటగిరీ సెక్యూరిటీకి కేటాయిస్తారు. Z- ప్లస్ కేటగిరీలోని వ్యక్తుల మొబైల్ సెక్యూరిటీ కోసం 10 మంది భద్రతా సిబ్బందిని, రెసిడెన్స్ సెక్యూరిటీకి ఇద్దరిని (రొటేషన్ కోసం మరో 8 మంది) కేటాయిస్తారు. Z+ లెవల్ సెక్యూరిటీని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు అందిస్తారు. ఇతర కేటగిరీ భద్రతను ఢిల్లీ పోలీసులు లేదా ITBP లేదా CRPF సిబ్బంది అందిస్తారు.
कुछ देर पहले छिजारसी टोल गेट पर मेरी गाड़ी पर गोलियाँ चलाई गयी। 4 राउंड फ़ायर हुए। 3-4 लोग थे, सब के सब भाग गए और हथियार वहीं छोड़ गए। मेरी गाड़ी पंक्चर हो गयी, लेकिन मैं दूसरी गाड़ी में बैठ कर वहाँ से निकल गया। हम सब महफ़ूज़ हैं। अलहमदु’लिलाह। pic.twitter.com/Q55qJbYRih
— Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022
ఒవైసీ విషయంలో ఏం జరిగింది?
గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఒవైసీ ఉత్తరప్రదేశ్ నుంచి న్యూఢిల్లీకి తిరిగి వస్తుండగా, ఆయన కాన్వాయ్పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటన సాయంత్రం 6 గంటల సమయంలో జరిగింది. ఆ సమయంలో ఒవైసీ వాహనం జాతీయ రహదారి 24లోని హాపూర్-ఘజియాబాద్ ఛిజార్సీ టోల్ ప్లాజా సమీపంలో ఉన్నట్లు PTI వార్తా సంస్థ నివేదించింది.
ఆ తర్వాత కాల్పులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను హాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నోయిడాకు సచిన్గా గుర్తించారు. అతనిపై గతంలో హత్యాయత్నం కేసు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేని సహరన్పూర్కు చెందిన శుభమ్ అనే రైతు కూడా నిందితుడిగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీకి కేంద్రం ఇప్పుడు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. తన ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, తాను ఎప్పుడూ భద్రత కోరలేదని ఒవైసీ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asaduddin Owaisi, Explained