కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్త దశలో ప్రతాపం చూపడానికి సమాయత్తమవుతోంది. ఒమిక్రాన్ కేసుల పెరుగుదలే ఇందుకు ఉదాహరణ. ఇలాంటి పరిస్థితుల్లో రెండు డోసుల కరోనా వ్యాక్సిన్కు తోడు మూడో డోసును ప్రజలకు ఇవ్వాలని కొన్ని దేశాలు నిర్ణయించాయి. ఈ జాబితాలో తాజాగా భారత్ కూడా చేరింది. కొన్ని వర్గాల ప్రజలకు బూస్టర్ షాట్ గా మూడో డోసును ఇచ్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ డోసులను ప్రికాషనరీ షాట్ గా ఆయన అభివర్ణించారు. ఇటీవలే 15 నుంచి 18 ఏళ్లలోపు జనాభాకు వ్యాక్సినేషన్ కు అంగీకారం తెలిపిన వేళ, కేంద్రం మూడో డోసుకు సైతం పిలుపునివ్వడం గమనార్హం. భారత్ సహా ఇప్పటికే 126 దేశాలు ఈ బూస్టర్ డోస్కు పచ్చజెండా ఉపాయి.
ప్రికాషనరీ డోస్ అంటే ఏంటి?
మనదేశంలో కరోనా వ్యాక్సిన్ ను ఇప్పటివరకు రెండు డోసుల్లోనే అందజేశారు. మూడో డోసునే ప్రికాషనరీ డోసుగా పిలుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు మూడో దోస్ వ్యాక్సిన్ను అందజేయడానికి దేశాలు సమాయత్తమవుతున్నాయి. మనదేశంలోనూ జనవరి 10 నుంచి ఈ మూడో డోసు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ముందుగా హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ కార్మికులు, వైద్యుల సలహామేరకు 60 ఏళ్లు పైబడిన వారికి ఈ ప్రికాషనరీ షాట్ ను ఇవ్వనున్నామని తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడో డోసును బూస్టర్ షాట్గా పేర్కొంది. ప్రాథమిక టీకా కార్యక్రమం ద్వారా వ్యాక్సిన్ తీసుకున్న జనాభాకు రోగనిరోధక శక్తి తగ్గకుండా, వ్యాక్సిన్ ప్రభావాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ బూస్టర్ డోసును ఇవ్వాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. రెండు డోసులు తీసుకున్న లక్ష్య జనాభాకు రోగనిరోధక శక్తి తగ్గకుండా మూడోసారి టీకాను అందించాలని స్పష్టం చేసింది. మహమ్మారిపై పోరాడేందుకు తగినంత ఇమ్యూనిటీని పెంచుకోవాలని తెలిపింది.
డోసుల మధ్య గ్యాప్..
బూస్టర్ లేదా అదనపు డోసు అందజేసేందుకు ఇప్పటికే 126 దేశాలు ముందుకువచ్చాయి. 120 దేశాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి కూడా. అయితే చాలా వరకు అధిక, మధ్యాదాయ దేశాలే మూడో డోసుపై దృష్టి పెట్టినట్లు డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. భారత్ లో రెండు, మూడు డోసుల మధ్య సగటున 9 నుంచి 12 నెలల అంతరముంటుందని నివేదికల సమాచారం. 61 శాతంపైగా పెద్దలు మనదేశంలో రెండు డోసులు తీసుకోగా.. 90 శాతంమందికిపైగా మొదటి డోసు స్వీకరించారని తెలిపాయి. ఈ డేటా ఆధారంగా కరోనా వ్యాక్సిన్ ప్రభావం కాలక్రమేణా తగ్గుతుందని పరిశోధకులు గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. దీని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. అంతేకాకుండా వ్యాక్సిన్ కూడా ఈ కొత్త వేరియంట్ పై ఎంతమేరకు ప్రభావం చూపుతుందో తెలియదు. వరుసగా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా మూడో డోసుపై దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి వ్యాక్సిన్ తీసుకున్నవారితో పోలిస్తే తీసుకోనివారిలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగా మూడో డోసుకు ప్రాధాన్యత పెరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫైజర్, బయోటెక్, మోడెర్నా, కోవిషీల్డ్, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి టీకాల ప్రభావం 8 శాతం తగ్గిందని, 50 ఏళ్లకు పైబడినవారిలో వీటి ప్రభావం 32 శాతం దిగజారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా నివేదించింది. దీంతో బూస్టర్ డోస్కు ప్రాధాన్యం ఏర్పడింది.
మూడో డోసుగా వేరే వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
చాలా వరకు మొదటి రెండు డోసులుగా ఒకే వ్యాక్సిన్ ను ఇచ్చారు. అయితే మూడో డోసుగా వేరే వ్యాక్సిన్ తీసుకోవచ్చా అనే అనుమానం చాలామందిలో మెదులుతోంది. బూస్టర్ డోసులను జులైలో మొదటిసారిగా ఇజ్రాయిల్ లో అందజేశారు. ఇప్పటికీ 6 నెలలు కూడా ముగియని కారణంగా దీనిపై స్పష్టత రాలేదు. టీకాల ద్వారా శరీరంలో యాంటీ బాడీలు పెరిగి ప్రభావవంతంగా పనిచేస్తాయని, ఇమ్యూనిటీ మెరుగుపడుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. హోమోలోగస్, హెటెరోలోగస్ రెండు బూస్టర్లు రోగనిరోధక శక్తిని పెంపొదిస్తాయని స్పష్టం చేసింది. మొదటి రెండు డోసులను ఏ వ్యాక్సిన్ నుంచి తీసుకున్నారో అదే టీకాను అందిస్తే హోమోలోగస్ బూస్టర్ అని, వేరే షాట్ తీసుకుంటే హెటెరోలోగస్ బూస్టర్ అని తెలిపింది.
ఈ విషయంపై భారత్ కూడా ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కొన్ని నివేదికల సమాచారం ప్రకారం రెండు రకాల బూస్టర్లను ప్రయత్నించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అమెరికా మాత్రం 18 ఏళ్లకు పైబడిన ప్రతి ఒక్కరూ మూడో షాట్ గా ఏ వ్యాక్సిన్ అయినా తీసుకునే అవకాశాన్నిచ్చింది. ప్రైమరీ షెడ్యూల్ లో మోడెర్నా షాట్ మినహా ప్రతి టీకాను బూస్టర్ షాట్ గా తీసుకునే అనుమతినిచ్చింది. అంతేకాకుండా ఫైజర్, మోడెర్నా లాంటి వ్యాక్సిన్లకు చెందిన మొదటి రెండు డోసుల తీసుకున్న తర్వాత మూడో షాట్ కు ఆరు నెలల కంటే తక్కువ అంతరమే ఉంది. అదే జాన్సన్ అండ్ జాన్సన్ అయితే రెండు నెలల గ్యాప్ ఉంది.
నిపుణులు ఏమంటున్నారు..
వైద్య నిపుణులు, పరిశోధకుల అభిప్రాయం ప్రకారం బూస్టర్ షాట్ శరీరంలో యాండీ బాడీలను పెంపొందించి మహమ్మారి రాకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది. కానీ, మూడో షాట్ గా వేరే వ్యాక్సిన్ తీసుకోవడంపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. కొంతమంది బూస్టర్ షాట్ గా ఇతర టీకాను తీసుకోవడాన్ని సమర్థించగా.. మరికొందరు మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.