DELHI HIGH COURT ORDERS COMPLETE DISCLOSURE OF VEG NON VEG INGREDIENTS OF FOOD ITEMS GH SK
Explained: ఆహార పదార్థాల్లో మాంసం కలిసిందని ఎలా తెలుసుకోవాలి? హైకోర్టు ఏం చెప్పింది?
ప్రతీకాత్మక చిత్రం
Food Items: ఆహార పదార్థాలతో వ్యాపారం చేసేవారు, తాము తయారు చేసే ఉత్పత్తుల్లో ఏమేం ఉపయోగిస్తున్నారో వెల్లడించేలా చూడాలని ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ను ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. ఆహార భద్రతా, ప్రమాణాలు (ప్యాకేజింగ్, లేబులింగ్) నిబంధనలు 2.2.2(4) రెగ్యులేషన్స్ను ఆపరేటర్లు పాటించేలా చూడాలని కోర్టు ఆదేశించింది.
ఆహార పదార్థాల (Food Items)తో వ్యాపారం చేసేవారు, తాము తయారు చేసే ఉత్పత్తుల్లో ఏమేం ఉపయోగిస్తున్నారో వెల్లడించేలా చూడాలని ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ (Food Safety Regulator) ను ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు (Delhi High Court). ఆహార భద్రతా, ప్రమాణాలు (ప్యాకేజింగ్, లేబులింగ్) నిబంధనలు 2.2.2(4) రెగ్యులేషన్స్ను ఆపరేటర్లు పాటించేలా చూడాలని కోర్టు ఆదేశించింది. ఏదైనా ఆహార పదార్థంలో ఏం కలుపుతున్నారో వెల్లడించాలని, శాతంతో సంబంధం లేకుండా దాన్ని మొక్కల నుంచి సేకరించారా లేదా జంతువుల నుంచి సేకరించారా లేదా ప్రయోగశాలలో రూపొందించారా అనే విషయాలు పేర్కోవాలని న్యాయస్థానం తెలిపింది. కేవలం కోడ్ భాషలో చెప్తే సరిపోదని స్పష్టం చేసింది.
‘ఏం తింటున్నామో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మోసం లేదా కప్పిపుచ్చే చర్యల ద్వారా ఏది పడితే అది అందించడానికి ఆహార పదార్థాల్లో అందించడానికి వీల్లేదు’ అని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ జస్మీత్ సింగ్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ నెల 9న ఆదేశాలు జారీ చేసింది.
* 2011 నిబంధనల ప్రకారం లేబులింగ్కు కావాల్సింది ఏంటి?
ఈ నిబంధనల ప్రకారం.. జంతువులు, పక్షులు, మంచి నీటి లేదా సముద్ర జలచరాలు, గుడ్లు లేదా ఏదైనా జంతువు నుంచి (పూర్తిగా లేదా పాక్షికంగా) సేకరించిన పదార్థంతో తయారైన పదార్థాన్ని మాంసాహారంగా పరిగణించాలి. అయితే వీటిలో పాలు, పాల పదార్థాలకు మినహాయింపు ఉంది. మాంసాహార ఉత్పత్తులు అన్నింటినీ బ్రౌన్ కలర్ సర్కిల్తో (ఒక నిర్ధిష్టమైన డయామీటర్) తెలియజేయాలి. ఆ సర్కిల్ను కూడా దాని డయామీటర్ కంటే రెట్టింపు సైజు కలిగిన స్క్వేర్లో పొందుపరచాలి. ఒకవేళ ఆ ఆహారంలో గుడ్డు మాత్రమే మాంసాహార పదార్థమైతే, దానికి సంబంధించిన డిక్లరేషన్ను ఆ గుర్తు కింద ఇవ్వవచ్చు. శాకాహారం అయితే ఆకుపచ్చ సర్కిల్ను అదే రంగు ఔట్లైన్తో కూడిన స్క్వేర్లో ఉంచి తెలియజేయాల్సి ఉంటుంది.
ఈ నిబంధన ప్రకారం తయారీదారులు తాము ఉపయోగించే పదార్థాల బరువు, పరిమాణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఏ రకం వంట నూనె, కూరగాయలు, వెజ్ ఫ్యాట్స్, జంతువుల కొవ్వు లేదా నూనె, చేప, కోడి మాంసం లేదా చీజ్ వంటివి అందులో ఉపయోగించారో తయారీదారులు వెల్లడించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక పదార్థాన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారు చేసి, ఆ మిశ్రమ పదార్థం ఆ ఆహారంలో ఐదు శాతం కంటే తక్కువగా ఉంటే.. ఆ మిశ్రమ పదార్థాల్లోని వస్తువుల జాబితాను వెల్లడించాల్సిన అవసరం లేదు. కానీ అందులో చేర్చే ఫుడ్ ఎడిటివ్ ఏంటో తెలియజేయాలని నిబంధనలు చెబుతున్నాయి.
ఈ విషయంలో రామ్ గో రక్షా దళ్ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. గోవుల భద్రత, సంక్షేమం కోసం పాటుపడే ఈ సంస్థ అక్టోబర్లో పిటిషన్ ఫైల్ చేసింది. కాక్రరీ, ధరించే వస్తువులు, యాక్సెసరీలు సహ అన్ని వస్తువులను.. వాటిలో ఉపయోగించే పదార్థాలను బట్టి మార్కు చేయాలని ఈ సంస్థ న్యాయస్థానాన్ని కోరింది. ఆహార పదార్థాల విషయంలో కేవలం లేబుల్ ముద్రిస్తే చాలదని, తయారీ ప్రక్రియలో ఉపయోగించే వస్తువుల పేర్లు కూడా వెల్లడించాలని కోరింది. నామ్ధారి వర్గానికి చెందిన ఈ ట్రస్టు, తమ వర్గం శాకాహారాన్ని కచ్చితంగా పాటిస్తుందని, జంతువులకు సంబంధించిన వాటిని ఏ రూపంలోనైనా తీసుకోవడంపై నిషేధం ఉందని తెలిపింది.
* లేబులింగ్తో సమస్యేంటి?
ఆహారం శాకాహారమా, మాంసాహారమా అన్నది స్పష్టంగా పేర్కొనాలనే చట్టం చెబుతోందనే విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. కానీ ఈ నిబంధనను తప్పుగా అన్వయించుకొని ఆహార పదార్థాలతో వ్యాపారం చేసేవారు ప్రయోజనం పొందుతున్నట్టు కనిపిస్తోందని న్యాయస్థానం పేర్కొంది. డైసోడియం ఐనోసేనేట్ అనే రసాయనాన్ని కోర్టు ఉదహరించింది. ఇన్స్టంట్ నూడుల్స్, ఆలూ చిప్స్లో ఉపయోగించే ఈ రసాయనాన్ని మాంసం లేదా చేపల నుంచి తయారు చేస్తారని తెలిపింది. అంతే కాదు, గూగుల్లో కాస్త వెతికితే ఇది పంది కొవ్వు నుంచి ఉత్పత్తి అవుతుందనే విషయం తెలుస్తుందని కూడా కోర్టు వివరించింది.
ఇలాంటి పదార్థాలు ఉపయోగించి వాటి వివరాలు వెల్లడించకుండా కేవలం ఆహార పదార్ధాల కోడ్స్ వేస్తే, వినియోగదారులకు ఎలా అర్థమవుతుందని కోర్టు ప్రశ్నించింది. చాలా ఆహార పదార్ధాల్లో జంతువుల నుంచి సేకరించిన పదార్థాలు ఉంటాయని, కాని వాటిపై గ్రీన్ డాట్ వేసి శాకాహారంగా విక్రయిస్తున్నారని కోర్టు తెలిపింది.
ఆహార పదార్ధాల్లో అత్యంత స్వల్ప శాతంలో మాంసాహార పదార్ధాలు వాడినా ఆ పదార్థం మాంసాహారం అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. కచ్చితమైన శాకాహారాన్ని పాటించేవారి మత, సాంస్కృతిక భావనలకు ఇవి విఘాతం కలిగిస్తాయని తెలిపింది. అంతే కాదు అది వారి మత, విశ్వాసాలు, ఆచరణలకు అంతరాయంగా నిలుస్తుందని పేర్కొంది.
ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 నిబంధనలు పాటించేలా చూడటంలో అధికారులు విఫలం కావడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. నిబంధన 2.2.2(4) (శాకాహారం లేదా మాంసాహార ప్రకటన)ను ఆహార వ్యాపార నిర్వాహకులు కచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, ప్రాసిక్యూషన్ను ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.