మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే విశాఖను పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన సీఎం.. నగరంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇతర నగరాలతో పోల్చుకుంటే విశాఖలో టీడీపీకి మంచి పట్టు ఉంది. తాజాగా గ్రేటర్ విశాఖ ఎన్నికల్లోనూ మరోసారి అది రుజువు అయ్యింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విశాఖలో నాలుగు అసెంబ్లీ స్థానాలు నెగ్గగా.. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో.. ఇతర నగరాలతో పోల్చుకుంటే టీడీపీకి బాగానే ఓట్లు పడ్డాయి. 30 స్థానాలను సొంతం చేసుకుంది. అలాగే టీడీపీ మద్దతుతో మరో రెండు సీట్లు వచ్చాయి. ఇక వైసీపీ నెగ్గిన చోట కూడా అత్యల్ప ఓట్లతోనే విజయం సాధించిన డివిజన్లు ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం.. విశాఖలో స్థానికంగా బీసీ సామాజిక వర్గం బలంగా ఉంది. వారంతా టీడీపీకి అండగా ఉంటున్నారు. దీంతో బీసీ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ పూర్తిగా దెబ్బ కొట్టాలి అంటే బీసీ ఓటర్లను ఆకర్షించుకోవాలన్నది వైసీపీ వ్యూహాంగా కనిపిస్తోంది.
తాజాగా కార్పోరేషన్ ఎన్నికల్లో నెగ్గిన వైసీపీ అధిష్టానం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోందని ప్రచారం జరుగుతోంది. జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కాగానే ప్రాంతాలు.. సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ఫార్ములాను.. ఏపీకి గుండె కాయలా వైసీపీ భావిస్తున్న విశాఖ కార్పోరేషన్ విషయంలోనూ అమలు పర్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా అన్ని అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే విశాఖకు ఒక మేయర్ ఉంటారు. కానీ డిప్యూటీ మేయర్ల విషయంలో మాత్రం కొత్తాగా ఆలోచిస్తున్నారు. ఏపీ కేబినెట్ మాదిరి.. ఎక్కువమంది డిప్యూటీ సీఎంల ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ మేయర్ పదవి బీసీ జనరల్ కు రిజర్వ్ అయ్యింది. అయితే మేయర్ పదవిని బీసీ జనరల్ కు కాకుండా.. బీసీ మహిళకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ కార్పొరేషన్ లో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖ తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరతో పాటు గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, భీమిలి ఉన్నాయి. అందుకే అన్ని నియోజవర్గాలకు సమాన ప్రధాన్యం ఇవ్వాలి అంటే ఎలా అనే కోణంలో అధిష్టానం ఆలోచిస్తునట్టు సమాచారం.
అందుకే ప్రతీ నియోజకవర్గానికి ఒక డిప్యూటీ మేయర్ ని నియమించాలని జగన్ ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే అన్ని నియోజకవర్గాలు అంటే సంఖ్య మరీ భారీగా అవుతుందనే ఆలోచనతో నలుగురు లేదా ఆరుగురు డిప్యూటీ మేయర్లను నియమించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సామాజికవర్గం కోణం నుంచే కాకుండా పాలనాపరంగా కూడా ఇది కొత్త విధానం అవుతుందని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.
చదువుకున్న వారు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని కూడా తెలుస్తోంది. అలాంటి నిర్ణయం తీసుకుంటే విశాఖ కార్పొరేషన్ ఏపీ రాజకీయ చరిత్రలో కొత్తగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి ప్రతిపాదన లేదు. అందుకు చాలానే కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీని బలహీన పర్చాలి అంటే బీసీ ఓటర్లకు అధిక ప్రధాన్యం ఇవ్వడమన్నది తొలి లక్ష్యం అయితే.. రెండోది ఏపీలోనే పెద్ద నగరమైన విశాఖపట్నం మేయర్ పీఠంపై అందరి చూపు నెలకొంది. దీంతో ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. జీవీఎంసీలో మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. వైసీపీకి చెందిన అభ్యర్థులు 58 మంది గెలుపొందారు. వీరిలో ఆశావాహులు చాలామంది ఉన్నారు. మేయర్ పదవి బీసీ జనరల్కు రిజర్వు అయినా.. మహిళకే మేయర్ పదవి ఇస్తారనే ప్రచారం ఉంది. దీంతో మిగిలిన ఆశావాహుల నుంచి వ్యతిరేకత ఎదురవ్వకుండా ఉండేందుకు ఎక్కువమంది డిప్యూటీ మేయర్ల ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.
దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ల నియామకాన్ని జగన్ సర్కార్ అమలు చేశారు. దానిపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా.. ఆ ఫార్ములా రాజకీయంగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే తరహాలో గ్రేటర్ విశాఖలో డిప్యూటీ మేయర్ లను నియమించే దిశగా అధిష్టానం అడుగులు వేస్తోంది. దీని వల్ల ఎక్కువమందికి ఈ హోదా, ఉపాధి, కల్పించినట్లు అవుతుందని ఆ పార్టీ నేతల అభిప్రాయంగా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా అసంతృప్తులకు అవకాశం ఉండదని, తరువాత తమకు అవకాశం వస్తుందని ఓపిక గా ఎదురు చూస్తారని.. పార్టీలో వర్గ పోరు తగ్గుతుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap local body elections, AP News, AP Politics, Municipal Elections, Visakhapatnam, Vizag