సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల ఇంగ్లీష్ పరీక్షలో అడిగిన ప్రశ్నలు వివాదాస్పదమయ్యాయి. మహిళలను చిన్నచూపు చూసే ధోరణిలో ఒక ప్యాసేజ్, దానికి సంబంధించిన ప్రశ్నలు పరీక్షలో వచ్చాయి. దీంతో ఈ అంశంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరికీ పూర్తి మార్కులను ప్రకటించాల్సి వచ్చింది. సీబీఎస్ఈ పరీక్షల్లో ఇలాంటి వివాదస్పద ప్రశ్నలు రావడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల 12వ తరగతి సోషియాలజీ, మ్యాథ్స్ పేపర్లలో బోర్డు సెట్ చేసిన ప్రశ్నలపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ప్రశ్న పత్రాలు రూపొందించే ప్రక్రియను సమీక్షించి, బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు సీబీఎస్ఈ ప్రశ్న పత్రాలను ఎలా రూపొందిస్తారో తెలుసుకుందాం.
* తాజా వివాదానికి కారణం ఏంటి?
గత శనివారం జరిగిన సీబీఎస్ఈ పదోతరగతి ఇంగ్లీష్ పరీక్ష పేపర్లో ఇచ్చిన ఓ ప్రశ్న వివాదాస్పదమైంది. భార్యల లెక్కలేనితనం (డిస్ఒబెడియన్స్ ఆఫ్ వైవ్స్) అనే ప్రశ్నపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ప్యాసేజ్లోని ఓ పేరాలో ‘భార్యలకు అధిక స్వేచ్ఛే.. పిల్లలపై తల్లిదండ్రుల నియంత్రణను నాశనం చేసింది’ అనే అర్థం వచ్చేలా వాక్యం ఉంది. భర్త మార్గాన్ని అనుసరించడం ద్వారానే తల్లి తన పిల్లల విధేయతను పొందగలదు.. లాంటి వాక్యాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్యారా తమ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని సీబీఎస్ఈ సర్ధిచెప్పుకోవాల్సి వచ్చింది.
* CBSE ప్రశ్నపత్రాలను రూపొందించడంలో ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు?
సాధారణంగా ప్రతి పరీక్షకు ఒకటి కంటే ఎక్కువ సెట్ల ప్రశ్న పత్రాలను బోర్డు రూపొందిస్తుంది. ఒక ఎగ్జామ్ సెంటర్లో, ఒకే సబ్జెక్ట్ పరీక్ష రాసే అభ్యర్థులకు వేర్వేరు ప్రశ్న పత్రాలను ఇవ్వవచ్చు. కానీ ఒక సబ్జెక్టుకు ప్రశ్న పత్రాలను సెట్ చేసిన సందర్భంలో.. ప్రశ్నలను సిద్ధం చేసేవారు, వాటిని సమీక్షించడానికి నియమించిన అధికారులు వాటిని విశ్లేషించాలి. వివిధ కాన్సెప్ట్లకు సంబంధించి అన్ని సెట్ల ప్రశ్నపత్రాలు పోల్చదగినవిగా ఉండేలా చూసుకోవాలి. అన్ని పేపర్లోనూ సంబంధిత సెక్షన్లలోని ప్రశ్నలు కాగ్నిటివ్ ఆపరేషన్, సమాధానం పరిధి, క్లిష్టత స్థాయి, టైమ్ లిమిట్, సిలబస్కు అనుగుణంగా ఉండాలి.
పేపర్-సెట్టర్లకు CBSE కొన్ని మార్గదర్శకాలు నిర్దేశిస్తుంది. ప్రశ్నలు తప్పుగా లేదా అస్పష్ట పదాలతో లేకుండా చూసుకోవాలి. భాష విషయంలో కూడా స్పష్టంగా ఉండాలి. ఏదైనా ప్రశ్న, కాన్సెప్ట్కు భిన్నమైన అర్థాన్నిచ్చేలా ఉండకూడదని బోర్డు చెబుతోంది. కానీ కొన్ని ప్రశ్నలు సిలబస్లో లేవు అని విద్యార్థులు కొన్నిసార్లు చెబుతుంటారు. అయితే పేపర్-సెట్టర్లు, మోడరేటర్లు.. ప్రతి ప్రశ్నపత్రాన్ని సబ్జెక్ట్, బ్లూప్రింట్, డిజైన్, పాఠ్య పుస్తకాలు, సిలబస్కు అనుగుణంగా సెట్ చేస్తారని CBSE చెబుతోంది. 10వ తరగతి ఇంగ్లిష్ పేపర్పై వివాదం చెలరేగడంతో, CBSE ఒక ప్రకటన విడుదల చేసింది. పరీక్షలో ఇచ్చిన ప్యాసేజ్పై వివరణలు (interpretations) భిన్నంగా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడితే, విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
* CBSE ప్రశ్న పత్రాలను ఎవరు సెట్ చేస్తారు?
ప్రశ్నపత్రాలను రూపొందించడానికి రెండు విభాగాలకు చెందిన నిపుణులు పనిచేస్తారు. పేపర్ సెట్టర్లు ప్రశ్నలను తయారు చేస్తారు. ఈ ప్రశ్నపత్రాన్ని మోడరేటర్లు సమీక్షిస్తారు. కానీ బోర్డు సూచనల మేరకు ఒక మోడరేటర్ లేదా మోడరేటర్ల బృందం అదనపు ప్రశ్నపత్రాల సెట్లను కూడా సిద్ధం చేయాల్సి ఉంటుందని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. పేపర్-సెట్టర్లు, మోడరేటర్లను CBSE నియమిస్తుంది. వీరి అర్హతల విషయానికి వస్తే.. ప్రశ్నలకు సంబంధించిన సబ్జెక్ట్ లేదా అనుబంధ సబ్జెక్ట్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు సంబంధిత సబ్జెక్టును బోధించడంలో.. సెకండరీ, సీనియర్ సెకండరీ లేదా కళాశాల స్థాయిలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాష్ట్ర, జాతీయ స్థాయి విద్యా సంస్థలలో పని చేస్తున్న వారిని కూడా బోర్డు నియమించవచ్చు. ఏదైనా సబ్జెక్ట్కు సంబంధించిన వృత్తిలో ఉన్న ఇతర ప్రముఖులను కూడా ఆ సబ్జెక్ట్లో పేపర్-సెట్టర్గా నియమించవచ్చని మార్గదర్శకాలు చెబుతున్నాయి. పేపర్ సెట్టర్లు, మోడరేటర్లను విభిన్న అవసరాల కోసం బోర్డు నియమిస్తుంది.
* ప్రశ్నలను సెట్ చేసే విధానంలో మార్పు వచ్చిందా?
గతంలో ఉన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (HRD) మంత్రిత్వ శాఖను ప్రస్తుతం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తున్నారు. CBSE ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు తీసుకువస్తున్నట్లు విద్యాశాఖ 2019 డిసెంబర్ లో పార్లమెంటుకు తెలియజేసింది. 2019-20 సెషన్ నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని పేర్కొంది. విద్యార్థులు బట్టీ పట్టి చదవకుండా, వారిలో క్రిటికల్ థింకింగ్, రీజనింగ్ ఎబిలిటీస్ను అభివృద్ధి చేసేలా ప్రశ్నల సరళి ఉంటుందని వెల్లడించింది. ఆ మేరకు CBSE అన్ని ప్రధాన సబ్జెక్టుల పరీక్షల్లో అడిగే ప్రశ్నల సంఖ్యను తగ్గించింది. విద్యార్థులు నిర్ణీత మూడు గంటల సమయంలో పెద్ద సమాధానాలు రాయాల్సిన అవసరం లేకుండా ఈ ఏర్పాట్లు చేసింది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నల సంఖ్యను పెంచడంతో పాటు డిస్క్రిప్టివ్ లేదా సబ్జెక్టివ్ ప్రశ్నలను తగ్గించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
2020 పరీక్ష సెషన్ నుంచి అన్ని ప్రధాన సబ్జెక్టులలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, ముఖ్యంగా 1 మార్కు ప్రశ్నలు దాదాపు 25 శాతం ఉంటాయని పేర్కొంది. విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, CBSE కొత్త మార్కింగ్ విధానాలు అవలంభిస్తుందని విద్యా శాఖ తెలిపింది. పుస్తకాల్లో ఉండే కచ్చితమైన సమాధానాలకు బదులుగా.. ప్రత్యామ్నాయ, వివరణాత్మక సమాధానాలు రాసే వారికి ఫుల్ మార్కులు ఇవ్వాలని పేపర్ ఎవాల్యుయేటర్స్ను బోర్డు కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, CBSE Board Exams 2021, Controversys, Parliament Winter session