ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్లకు సంబంధించి అనూహ్య ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గ్రామ సచివాలయంలోనే మైనర్ బాలికపై ఓ వాలంటీర్ అత్యాచారానికి ఒడిగడితే, దానికి రివర్సులో చిత్తూరు జిల్లాలో ఓ మహిళా వాలంటీర్ ను గ్రామ సచివాలయంలోనే కులం పేరుతో దూషిస్తూ దాడి జరిగింది. సచివాలయంలో సిబ్బంది సాక్షిగా తాను ఎదుర్కొన్న దారుణమైన అనుభవాన్ని వివరిస్తూ బాధిత మహిళా వాలంటీర్ అనిత పెట్టిన వీడియోలు సంచలనం రేపుతున్నాయి. దళితురాలైన బాధిత వాలంటీర్ ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా పోలీసులు అగ్రకులాలకు చెందిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండల పరిధిలోని శెట్టివానత్తం గ్రామంలో అనిత అనే మహిళ వాలంటీర్ గా పనిచేస్తున్నారు. గ్రామ సచివాలయంలోనే శనివారం నాడు అధికార వైసీపీకి చెందిన పలువురు నాయకులు తనపై దాడి చేశారని వాలంటీర్ అనిత పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలోనే సెక్రటరీ, ఇతర సిబ్బంది చూస్తుండగానే రెడ్డి కులానికి చెందిన వైసీపీ నేతలు తనపై దాడి చేసి, కులం పేరుతో బండబూతులు తిట్టారని బాధితురాలు ఆరోపించారు.
సచివాలయంలో వైసీపీ నేతలు దాడి చేయడం, కులం పేరుతో దూషించిన ఘటనపై ఎస్ఆర్ పురం పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా వాలంటీర్ అనిత.. తనకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. భూవివాదాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. మూడు నెలల కిందట.. వాలంటీర్ అనితకు చెందిన భూమిలో అదే ఊరికి చెందిన అగ్రకులాలకు చెందిన వైసీపీ నాయకులు రాత్రికి రాత్రి వేరుశనగ పంట వేయడంతో అప్పట్లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటి ఘటనను మనసులో పెట్టుకుని, విచారణను అడ్డంపడటమే కాకుండా వైసీపీ నేతలు ఇప్పడు ఏకంగా దౌర్జాన్యానికి దిగారంటూ బాధిత మహిళ వాపోయింది. కాగా,
తనను కులం పేరుతో దూషించారంటూ బాధితురాలైన మహిళా వాలంటీర్ అనిత ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు మాత్రం సచివాలయ సిబ్బందిపై దాడి చేశారని పేర్కొంటూ వైసీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తామని ఎస్ఆర్ పురం పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap grama sachivalayam, AP News, Chitoor