కొందరు మాయగాళ్లు పెద్దగా చదువుకోకపోయినా.. సోషల్ మీడియాలో మోసాలు చేయడంలో ఆరితేరిపోతున్నారు. అందులో అమ్మాయిలను తమ మాయమాటలతో ఆకట్టకుని ఆ తరువాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలాంటి ఓ మోసగాడిని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. అతడి వయసు, అతడి చదువు గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్లితే.. ఢిల్లీ ఫతేపూర్ బేరి పోలీసులు ఇటీవల 23 ఏళ్ల అబ్దుల్ సమాద్ అనే యువకుడికి ఓ కేసు నిమిత్తం అరెస్ట్ చేశారు. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు... సైబర్ క్రైమ్ ద్వారా విచారణ చేపట్టి ఇతడిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన తరువాత కానీ అసలు ఇతగాడి లీలలు వారికి అర్థంకాలేదు. ఇంత తక్కువ వయసులోనే సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం ఎలాగో తెలుసుకుని అసాంఘిక కార్యకలాపాలకు సమాద్ పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
ముందుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అమ్మాయిలకు తాను కూడా అమ్మాయినే అంటూ పరిచయం చేసుకుంటాడు సమాద్. వారితో అమ్మాయిలాగానే ఛాటింగ్ చేస్తూ నమ్మకం కలిగిస్తాడు. అలా కొన్ని రోజులు పోయిన తరువాత తాను చేయదలుచుకున్న అసలు పని మొదలుపెడతాడు. తాను ఎలా ఉన్నానో చెబుతానంటూ కొన్ని వీడియోలను వారికి పోస్ట్ చేస్తాడు. అందులో కొన్ని పర్సనల్ ఫోటోలు కూడా ఉంటాయి. ఇతగాడిని నమ్మిన అమ్మాయిలు కొందరు.. వారికి సంబంధించిన పర్సనల్ ఫోటోలను కూడా పోస్ట్ చేయడం మొదలుపెడతారు.
అంతే.. వెంటనే వారిని ఆ వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిట్ చేయడం మొదలుపెడతాడు సమాద్. వివిధ మార్గాల ద్వారా వారి కాంటాక్ట్ నంబర్ను తెలుసుకుని వారికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతాడు. ఇలా నిందితుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చిన 15 ఏళ్ల యువతి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ క్రైమ్ ద్వారా విచారణ చేపట్టి నిందితుడు అబ్దుల్ సమాద్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టగా.. అతడు చేస్తున్న ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. అయితే ఇతడిపై ఒక్క అమ్మాయి తప్ప.. ఇంకెవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
Harish Rao: టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్రావుకు వింత పరిస్థితి.. ప్లస్సా ? మైనస్సా ?
అయినప్పటికీ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. భవిష్యత్తులో ఇతడిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తారేమో చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇతడి బాధితుల సంఖ్య ఎంతలా ఉందనే విషయంపై ఆరా తీస్తున్నట్టు తెలిపారు. పెద్దగా చదువుకోకపోయినా.. సోషల్ మీడియాను వినియోగించడంలో ఆసక్తి పెంచుకున్న సమాద్.. ఈ రకమైన చర్యలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అతడు ఇంకెవరెవరిని బ్లాక్ మెయిల్ చేశాడనే దానిపై విచారణ చేస్తామని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cirme