సహరాన్పూర్: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు తలెత్తడం సహజం. కానీ.. ఆ గొడవలు ముదిరితే పరిస్థితులు చేయి దాటి పోయే ప్రమాదం ఉంది. క్షణికావేశంలో హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న జంటలు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలోని సహరాన్పూర్ జిల్లా ధరమ్పూర్ సరౌగి అనే గ్రామానికి చెందిన దిలీప్ అనే యువకుడికి, ప్రతిభ అనే యువతికి ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఉత్తరాఖండ్లోని ఓ కంపెనీలో దిలీప్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. 11 రోజుల క్రితం ప్రతిభ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
కొడుకు పుట్టాడన్న సంగతి తెలిసి దిలీప్ సెలవు పెట్టి సంతోషంగా ఇంటికొచ్చాడు. పిల్లాడు పుట్టిన సంతోషంలో దిలీప్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. అయితే.. దిలీప్కు ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. భార్యాభర్తల మధ్య తలెత్తిన కుటుంబపరమైన గొడవలు దిలీప్కు మనశ్శాంతిని దూరం చేశాయి. ఇంటికి వచ్చినప్పటి నుంచి భార్యతో దిలీప్కు రోజూ గొడవే. భార్యకు సర్ది చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినకపోయే సరికి క్షణికావేశంలో దిలీప్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. దిలీప్ తల్లి ఇంట్లో లేదు. ఆ సమయంలో భార్యను నమ్మించి విషాహారం తినిపించాడు.
ప్రతిభ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత దిలీప్ కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. చనిపోయే ముందు తాను ఎందుకు చనిపోతున్నాడో, భార్యను ఎందుకు చంపేశాడో దిలీప్ సవివరంగా ఓ సూసైడ్ నోట్ రాశాడు. ఆ సూసైడ్ నోట్ను చివరిగా వాట్సాప్ స్టేటస్గా కూడా పోస్ట్ చేశాడు. ఈ జీవితం పట్ల విసిగిపోయానని.. తాను పెళ్లి చేసుకున్నప్పుడు తాను ఒక్కడిని తప్ప అందరూ సంతోషపడ్డారని రాశాడు.
ఎంతో పవిత్రమైన ఒక బంధంపై తన భార్య పవిత్ర దారుణమైన ఆరోపణలు చేసిందని.. ఆమెతో ఒక్కో రోజు ఎలా గడిపానో అర్థం కావడం లేదని దిలీప్ రాసుకొచ్చాడు. తన భార్య వల్ల తాను తీవ్ర మనస్తాపం చెందానని.. అందువల్లే ఆమెను చంపి, తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో దిలీప్ చెప్పుకొచ్చాడు. తన తల్లి ఆమె పుట్టింటికి వెళ్లిందని.. పూర్తి స్పృహతోనే తన భార్యను చంపేశానని, తానూ చనిపోతున్నానని దిలీప్ చెప్పాడు.
తన కొడుకు పేరు యష్ అని, తన తల్లి రాగానే యష్ను ఆమెకు అప్పగించాలని కోరాడు. తన తల్లి, ఇద్దరు సోదరిలు వచ్చేవరకూ తన అంత్యక్రియలు నిర్వహించవద్దని దిలీప్ రాశాడు. దిలీప్ రాసిన సూసైడ్ నోట్లో ఫోన్ పాస్వర్డ్ను కూడా చివర్లో రాశాడు. దిలీప్ తండ్రి చనిపోయాక భార్య, తల్లితో కలిసి ఉంటున్నాడు. తన ఇద్దరు సోదరిలకు వివాహాలయ్యాయి. స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Family dispute, Man commit to suicide, Wife murdered