మదన్పూర్: తల్లి కాబోతోందని తెలిసి మురిసిపోయింది. కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నవమాసాలు మోసింది. ప్రసవ వేదనను భరించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ.. క్షణికావేశం ఆ తల్లిని క్రూరురాలిగా మార్చింది. భర్తపై కోపాన్ని బిడ్డపై చూపించేలా చేసింది. చివరికి.. కన్న తల్లి చేతిలోనే ఆ పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన బీహార్లోని మదన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదన్పూర్ పరిధిలో నివాసం ఉంటున్న జ్యోతి, అరవింద్ కుమార్ భార్యాభర్తలు. వీరికి ఆదర్శ్ అనే ఐదు నెలల వయసున్న బాబు ఉన్నాడు. పెళ్లైన కొంత కాలం అన్యోన్యంగానే ఉన్న ఈ జంట మధ్య రానురానూ మనస్పర్థలు పెరిగాయి. చీటికీమాటికీ గొడవ పడుతుండేవారు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు ఎంత వారించినా ఈ భార్యాభర్తల తీరు మారలేదు. ఈ క్రమంలోనే.. జ్యోతి మగ పిల్లాడికి జన్మనిచ్చింది. పిల్లాడు పుట్టిన కొన్నాళ్లు భార్యాభర్తలిద్దరూ సఖ్యతగానే కనిపించినా ఇటీవల మళ్లీ వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవల కారణంగా అరవింద్ తన తల్లిదండ్రులతో ఉండకుండా వేరు కాపురం కూడా పెట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ మనస్పర్థలు ఏమాత్రం సమసిపోలేదు. ఇటీవల ఏదో విషయంలో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈసారి ఈ గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారింది.
భార్య ఇంట్లో వంట వండటం మానేసింది. భార్యాభర్తలిద్దరూ కొన్ని రోజుల నుంచి బయట నుంచి భోజనం తెచ్చుకుని తింటున్నారు. ఈ క్రమంలోనే.. శుక్రవారం ఉదయం అరవింద్ పని మీద బయటకు వెళ్లాడు. సాయంత్రానికి తిరిగొచ్చి ఐదు నెలల కొడుకు ఆదర్శ్ కోసం చూడగా ఆ పిల్లాడు బెడ్పై రక్తపు మడుగులో కనిపించాడు. కొడుకును అలా చూసి అరవింద్ నిర్ఘాంతపోయాడు. ఆ షాక్ నుంచి కొంతసేపటికి తేరుకుని పిల్లాడిని ఒడిలోకి తీసుకున్నాడు. ఆదర్శ్లో ఎలాంటి చలనం లేదు. భయంతో ఆ తండ్రి కొడుకుకు శ్వాస తీసుకున్నాడో.. లేదో పరిశీలించగా ఆదర్శ్ చనిపోయినట్లు తేలింది. అదే ఇంట్లో ఒక మూలన కూర్చుని ఉన్న జ్యోతిని ఏం జరిగిందని భర్త అరవింద్ నిలదీశాడు. క్షణికావేశంలో బిడ్డను తానే చంపినట్లు జ్యోతి ఒప్పుకుంది.
అరవింద్ వెంటనే తన కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. స్పాట్కు చేరుకున్న పోలీసులు జ్యోతిని అరెస్ట్ చేశారు. తన భర్తపై కొన్నాళ్లుగా కోపంగా ఉన్నానని, అలా కోపంగా ఉన్న సమయంలో పిల్లాడు ఏడవడంతో క్షణికావేశంలో నేలకేసి కొట్టినట్టు జ్యోతి విచారణలో చెప్పింది. నవ మాసాలు కడుపులో మోసి పెంచిన బిడ్డను చంపడానికి ఆమెకు చేతులెలా వచ్చాయని రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవకు.. తల్లి క్షణికావేశానికి అన్యాయంగా ఐదు నెలల బాబు బలి కావడం శోచనీయం. పోలీసులు అరవింద్ ఫిర్యాదు మేరకు జ్యోతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Family dispute, Husband, Mother, Wife