భర్తలు తమ భార్యలకు స్కూటీ నేర్పించడం చూశాం. ఇంటి, పొలం పనుల్లో సూచనలు చేయడం చూశాం. కానీ ఓ వ్యక్తి తన భార్యకు ఏకంగా తుపాకీ పేల్చడం నేర్పించాడు. ఐతే అంతలోనే ఘోరం జరిగిపోయింది. తుపాకీ పేలి అతడి భార్య మరణించింది. తుపాకీ కాల్చడం నేర్పిస్తానని చెప్పి భార్యను భర్త చంపిన ఈ దారుణ ఘటన.. కర్నాటకలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తుమకూరు జిల్లా డి. కొరటిగెరె గ్రామానికి చెందిన కృష్ణప్ప (35), శారద (28) భార్యా భర్తలు. ఏం అవసరం వచ్చిందో ఏమో.. తన భార్యకు తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇస్తానని చెప్పాడు కృష్ణప్ప. సోమవారం రాత్రి తన స్నేహితుడి వద్దనున్న నాటు తుపాకీని తీసుకొచ్చి.. ఎలా కాల్చాలో చూపించాడు.
ఏం జరిగిందో ఏమో గానీ.. ఆ తుపాకీ పేలి శారద మరణించింది. పాయింట్ బ్లాంక్లో బుల్లెట్ నేరుగా ఆమె తలలో దిగింది. తీవ్ర రక్తస్రావమై.. అక్కడికక్కడే శారద కుప్పకూలి మరణించింది. తుపాకీ పేలిన శబ్ధం విని స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అదే రాత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త కృష్ణప్పతో పాటు నాటు తుపాకీ వాడుతున్న అతడి మిత్రుడిని కూడా అరెస్ట్ చేశారు. ఐతే కృష్ణప్ప తన భార్యను కావాలనే చంపేశాడా? లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:January 13, 2021, 08:24 IST