చెన్నై: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ససేమిరా అన్నారు. యువతి తల్లిదండ్రులు కాస్తంత మెత్తబడినా.. యువకుడి తల్లిదండ్రులు మాత్రం అగ్ర సామాజిక వర్గం కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో.. ఆ యువకుడి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. 2019లో పెళ్లి చేసుకుని చెన్నైలో ఉంటున్న ఈ జంటకు ఊహించని ఉపద్రవం ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా అరియనెల్లూరు గ్రామానికి చెందిన అమూల్య అనే యువతి నర్సుగా ఉద్యోగం చేస్తుండేది.
చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఆ యువతి రోజూ ట్రైన్లో వెళ్లి వస్తుండేది. అదే ట్రైన్లో రోజూ చెన్నైకు వెళ్లి పని చేసుకుని తిరిగి వస్తుండే కరణి గ్రామానికి చెందిన గౌతమ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. గౌతమ్ అగ్ర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అమూల్యతో పెళ్లికి అతని కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో.. ఇద్దరూ కలిసి చెన్నై వెళ్లి ప్రేమ పెళ్లి చేసుకుని అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు.
2019 నుంచి అక్కడే సంతోషంగా ఉంటున్న ఈ జంటకు ఊహించని ఉపద్రవం ఎదురైంది. సెప్టెంబర్ 17న గౌతమ్కు బంధువుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బాగా దగ్గర బంధువుల్లో ఒకరు చనిపోయారని, చివరి చూపుకు రావాలని గౌతమ్కు చెప్పడంతో హుటాహుటిన అక్కడకు వెళ్లాడు. అలా వెళ్లిన గౌతమ్ ఇంక తిరిగి రాలేదు. భర్త రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడం, ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో అమూల్యలో కంగారు మొదలైంది. ఇలా గౌతమ్ తిరిగి రాలేదని అమూల్య తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు గౌతమ్ సొంతూరికి వెళ్లారు. ఆ ఊర్లో గోడలపై గౌతమ్ శ్రద్ధాంజలి పోస్టర్లు చూసి అమూల్య తల్లిదండ్రులు షాకయ్యారు. అప్పటికే గౌతమ్ అంత్యక్రియలు కూడా పూర్తయినట్లు తెలిసి కూతురికి జరిగిన విషయం చెప్పారు.
అమూల్య ఈ ఘటన గురించి తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గత నెలలోనే అమూల్యకు ఒక పాప పుట్టింది. ఆ పాపను వెంటబెట్టుకుని తన భర్తను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని అరణి పోలీస్ స్టేషన్లో అమూల్య ఫిర్యాదు చేసింది. ఇది కచ్చితంగా పరువు హత్యేనని, ఈ పెళ్లి గౌతమ్ తల్లిదండ్రులకు ఇష్టం లేదని.. తన భర్తను నమ్మించి సొంతూరు తీసుకెళ్లి చంపేశారని.. విషయం బయటకు పొక్కకుండా అంత్యక్రియలు కూడా చేశారని అమూల్య కన్నీరుమున్నీరయింది. ఇంక తనకు దిక్కెవరని ఆ పసిబిడ్డను ఎత్తుకుని అమూల్య రోదించిన తీరు కంటతడి పెట్టించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, Crime news, Honor Killing, Love marriage, Lovers, Tamilnadu