news18-telugu
Updated: November 29, 2020, 3:18 PM IST
ప్రతీకాత్మక చిత్రం
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. భార్యాభర్తల బంధాన్ని విడదీసి.. ప్రాణాలను తీస్తున్నాయి. ''ప్రియురాలు కోసం భార్యను చంపిన భర్త'', ''ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య''... ఇలాంటి వార్తలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్యచేసింది భార్య. సుపారీ గ్యాంగ్ను నియమించి.. సైనైడ్ చల్లి.. అత్యంత దారుణంగా చంపేసింది. నవంబరు 4న జరిగిన ఘటనపై పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరుకు చెందిన బ్రహ్మయ్య (42)పై నవంబరు 4న దాడి జరిగింది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఆయనపై సైనేడ్ చల్లారు. వారి నుంచి తప్పించుకున్న బ్రహ్మయ్య.. బంధువుల ఇంటికి వెళ్లాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. భార్యే హంతకురాలని తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బ్రహ్మయ్య స్థానికంగా హోటల్, పాల దుకాణం నడుపుకుంటూ జీవన సాగిస్తున్నాడు. అతడి భార్య పేరు సాయి కుమారి. ఐతే కొన్నాళ్లుగా అశోక్ రెడ్డి అనే యువకుడితో సాయికుమారి వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త అడ్డును తొలగించుకొని.. ప్రియుడితో జీవించాలని నిర్ణయించుకుంది. అశోక్ రెడ్డితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసేందుకు స్కెచ్ వేసింది సాయికుమారి. ఈ క్రమంలోనే మచిలీపట్నానికి చెందిన పవన్ కుమార్, షేక్ షరీఫ్కు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను చంపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా కొత్త అడ్వాన్స్ కూడా చెల్లించింది. సైనైడ్తో బ్రహ్మయ్యను చంపాలని వారు నిర్ణయించుకున్నారు. ఎలాగోలా సైనైడ్ను తెచ్చుకొని మొదట కుక్కపై ప్రయోగించారు. బిస్కెట్లో కలిపి తినిపించారు. అది కాసేపటికే మరణించడంతో.. ఇదే ప్లాన్ను బ్రహ్మయ్యపై అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.
అనంతరం నవంబరు 4న రాత్రి బ్రహ్మయ్యపై పవన్, షరీఫ్ సైనైడ్ చల్లి పారిపోయారు. బ్రహ్మయ్య తప్పించుకొని బంధువుల ఇంటికి వెళ్లాడు. వారు ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే అతడు మరణించాడు. ఐతే కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. హత్య జరిగిన రోజు అక్కడి టవర్ లొకేషన్కు వచ్చిన ఫోన్ కాల్స్ జాబితా ఆధారంగా దర్యాప్తు చేశారు. మృతుడు బ్రహ్మయ్య భార్య సాయికుమారి ఫోన్ నుంచి అదే గ్రామానికి చెందిన అశోక్ రెడ్డికి కాల్ వెళ్లినట్లు గుర్తించారు. అంతేకాదు అదే టవర్ నుంచి మచిలీ పట్నానికి కూడా కాల్స్ వెళ్లాయి. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అశోక్ రెడ్డి, సాయికుమారిల వివాహేతర సంబంధం బయటపడింది. ప్రియుడి కోసం తానే హత్యకు స్కెచ్ వేశానని విచారణలో ఒప్పుకుంది. పోలీసులు సాయికుమారితో పాటు మిగిలిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 29, 2020, 3:17 PM IST