అది తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ పరిధిలోని న్యాల్ కల్ మండలం బసంత్ పూర్ గ్రామం. ఆ గ్రామానికి దగ్గర్లోనే ఓ చెక్ డ్యామ్ ఉంది. స్థానికులకు ఆ డ్యామ్ లో ఓ మూట కనిపించింది. ఏంటా అని బయటకు తీసి చూశారు. అంతే ఒక్కసారిగా కంగుతిన్నారు. దాంట్లో మనిషి తల, కాళ్లు, చేతులు, మొండెం ఉన్నాయి. అంతా భయపడిపోయి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులు వచ్చి వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు.? ఎవరు చంపి ఉంటారు.? అన్న వివరాల గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే అతడు తెలంగాణ పౌరుడు కాదని తెలుసుకున్నారు. పక్కనే సరిహద్దు గ్రామం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దీంతో కర్ణాటక పోలీసులకు ఆ విషయం తెలియజేశారు. దీంతో ఆ రాష్ట్ర పోలీసులు కూడా రంగంలోకి దిగడంతో పోలీసులకు పని ఈజీ అయింది. సొంత భార్య, కన్న కొడుకులతో కలిసి అతడిని చంపి, ముక్కలుగా చేసి నదిలో పారేసిందని విచారణలో వెల్లడయింది.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోనే, కర్ణాటక రాష్ట్రానికి చెందిన అష్టూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో 57 ఏళ్ల వైద్యనాథ్, తన భార్య పుణ్యమ్మ, కుమారులు అంకుష్, ఆకాశ్ లతో కలిసి ఉండేవాడు. అయితే ఇటీవల వైద్యనాథ్ తన భార్య పుణ్యమ్మపై అనుమాన పడుతూ ఉన్నాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని ఇంట్లో గొడవ పడుతూ ఉన్నాడు. తరచూ ఇంట్లో గొడవ జరుగుతుంటంతో ఆ తల్లీ, ఇద్దరు కుమారులు కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. సమీప బంధువులైన సంతోష్, అనుకేష్ సహాయం తీసుకున్నారు. డిసెంబర్ 31న వైద్యనాథ్ ను ఇంట్లో బంధించి బాగా కొట్టారు. అతడిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని బయట పడేస్తే సులభంగా గుర్తిస్తారని ఓ క్రూరమైన ఆలోచన చేశారు. వైద్యనాథ్ తల, కాళ్లు, చేతులు వేరు చేశారు. అన్నింటినీ కలిపి ఓ మూట కట్టారు.
అదే ఊళ్లో పడేస్తే ప్రమాదముందని భయపడి, రాష్ట్ర సరిహద్దు దాటారు. తెలంగాణ ప్రాంతంలోకి వచ్చారు. జహీరాబాద్, న్యాల్ కల్ మండలం బసంత్ పూర్ శివారుకు వచ్చి అక్కడ చెక్ డ్యామ్ లో ఆ మూటను పడేశారు. జనవరి 8న ఆ మూటను గ్రహించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూట కట్టిన బస్తా తెలంగాణ రాష్ట్రానికి చెందినది కాకపోవడంతో, కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కూడా రంగంలోకి దిగి అన్ని సరిహద్దు గ్రామాల్లో విచారణ ప్రారంభించారు. మొత్తానికి ఆ మృతదేహం అష్టూర్ గ్రామానికి చెందిన వైద్యనాథ్ ది అని తేల్చారు. ఈ ఘోరంలో పాలు పంచుకున్న బంధువులైన సంతోష్, అనుకేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య పుణ్యమ్మ, కుమారులు అంకుష్, ఆకాశ్ లు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, Wife kill husband