విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ వల్ల దాదాపు రెండు వేల మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు కూడా. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. నడిరోడ్డుపైనే కుప్పకూలిపోయారు. లాక్ డౌన్లో ఉన్న కంపెనీని తెరిపించే క్రమంలో ఈ రోజు తెల్లవారు జామున 4గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పరిశ్రమ నుంచి పీవీసీ గ్యాస్ లీకైనట్లు తెలిపారు. గ్యాస్ లీకేజీతో పరిసరాల్లోని చెట్లు వాడిపోయాయి. ఊపిరాడక పలు మూగ జీవాలు మృత్యువాతపడ్డాయి.
కాగా, స్థానిక ఎమ్మెల్యే అదీప్రాజ్తో పాటు జిల్లా కలెక్టర్ వినయ్చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గ్యాస్ లీకైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కలెక్టర్ వినయ్చంద్కు ఫోన్ చేసి ఆరా తీశారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు 11.45కు సీఎం విశాఖకు రానున్నారు. అయితే...ప్రస్తుతానికి గ్యాస్ లీక్ ఆగింది. ప్రతి ఇంటిని తనిఖీ పోలీసులు, సిబ్బంది తనిఖీ చేస్తున్నారు.
అటు.. ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆస్పత్రి పాలు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మూగజీవాలు కూడా మృతి చెందాయని.. కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలని లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Visakhapatnam