భోపాల్: కూరగాయలు బయట కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. అవి అమ్ముతున్న ప్రాంతం పరిశుభ్రంగా ఉందా, లేదా.. కూరగాయలు మంచిగా ఉన్నాయా లేదా అని చూసి మరీ కొంటాం. ఎందుకంటే.. ఏదైనా తేడా వస్తే ఆ కూర తిన్న తర్వాత కుటుంబం మొత్తం అస్వస్థతకు లోనయ్యే ప్రమాదం ఉంది. అసలే కరోనా లాంటి వైరస్లు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాయి. ఇంత భయంభయంగా బతుకుతున్న ఈరోజుల్లో కూరగాయలను, ఆకు కూరలను మురికినీటిలో ముంచి.. ఆ కూరగాయలను మనం తింటే ఇంకేమైనా ఉందా. కానీ.. అక్కడ ఆకుకూరలు తిన్నవారికి అలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. భోపాల్లో ఓ వ్యక్తి కూరగాయలు, ఆకు కూరలు తాజాగా కనిపించేందుకు మురికి నీళ్లలో ఆకుకూరలను ముంచి వాటిని అమ్ముతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. భోపాల్లోని రోహిత్ నగర్లో రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టుకుని ఓ పెద్దాయన కూరగాయలు, ఆకు కూరలు అమ్ముతున్నాడు. మెయిన్ రోడ్ పక్కనే ఉండటంతో అతని దగ్గర స్థానికులు కూరగాయలు, ఆకు కూరలు బాగానే కొనుగోలు చేసేవారు. కానీ.. ఆ పెద్ద మనిషి ఏమాత్రం భయపడకుండా.. ఆ పక్కన ఓ యువకుడు కూర్చుని ఉన్నప్పటికీ ఆకుకూరలను పక్కన ఉన్న మురికి కాలువలో ముంచుతున్నాడు.
ఈ ఘటనను అటుగా వెళుతున్న వ్యక్తి ఎవరో ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో.. ఆ వీడియో ఒక్కసారిగా వైరల్గా మారింది. కరోనా లాంటి మహమ్మారులు కోరలు చాస్తున్న ఈరోజుల్లో శుభ్రంగా ఉండాలని నెత్తీనోరూ కొట్టుకుంటుంటే ఏకంగా తినే కూరగాయలు, ఆకు కూరలనే ఇలా కలుషిత నీటిలో ముంచి అమ్ముతుంటే ప్రజల ఆరోగ్యానికి ఇంక భద్రత ఎక్కడ ఉంటుందని వీడియో చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. అతనిని అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలని మరికొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై భోపాల్లోని ప్రముఖ డాక్టర్. రాకేష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. మురికి కాలువలో పారే కలుషిత నీటిలో ఎన్నో రకాలైన బ్యాక్టీరియా ఉంటుందని.. అలాంటి నీళ్లలో ముంచుతున్న ఈ కూరగాయలను, ఆకు కూరలను ఇంటికి తెచ్చుకుని మంచి నీటితో ఎంత శుభ్రం చేసినా క్రిములు ఉంటానే ఉంటాయని.. అలాంటి కూరగాయలను కూర వండుకుని తింటే రోగాల బారిన పడక తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. కడుపులో ఇన్ఫెక్షన్ సోకి జాండిస్ వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ఒకవేళ.. శుభ్రంగా ఉన్న చోట పండ్లు, కూరగాయలు కొన్నప్పటికీ ఇంటికి తెచ్చుకుని శుభ్రంగా కడుక్కుని మాత్రమే తినడం గానీ, వండుకోవడం గానీ చేయాలని ఆయన సూచించారు. వేడి నీళ్లలో కడిగితే మరీ మంచిదని అంటున్నారు. ఆ పెద్దాయన చేసిన పని భోపాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం ఇలాంటి వారిని ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ రాష్ట్ర రాజధాని నగరంలోనే ఇలాంటి సీన్ కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhopal, Crime news, Vegetables, Viral Video