(K. Veeranna, News18, Medak)
ఇద్దరు యువకులు పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్ (Petrol) పోసుకొని ఆత్మహత్యకు (Suicide) యత్నించిన ఘటన శనివారం మెదక్ (Medak) జిల్లా తూప్రాన్లో చోటు చేసుకుంది. తూప్రాన్ పురపాలిక పరిధి ఆబోతుపల్లికి చెందిన సతీష్ యాదవ్, ప్రవీణ్ లు ఆత్మహత్యకు యత్నించారు. వారు తెలిపిన వివరాలు. తూప్రాన్ పురపాలిక పరిధి ఆబోతుపల్లిలో కొంత కాలంగా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆబోతుపల్లి తూప్రాన్ కు చెందిన అధికార పార్టీ నాయకుల సూచనలతో పోలీసులు తమతో పాటు మరికొంతమందిపై అక్రమంగా 19 కేసులు నమోదు చేశారన్నారు. ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. తన తండ్రిపై దాడి చేసి తల పగులగొట్టినా పోలీసులు పట్టించుకోలేదని, చివరకు ఎస్పీని కలిస్తే స్పందించారని ప్రవీణ్ తెలిపారు. గ్రామంలో ఏ ఘటన జరిగినా తమనే బాధ్యులను చేస్తున్నారని వాపోయారు. సిబ్బంది ఇష్టానుసారంగా నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
బోనాల పండగకు సంబంధించి..
ఆదివారం గ్రామంలో జరిగే బోనాల పండగకు సంబంధించి శుక్రవారం చర్చిస్తుండగా చిన్న గొడవ తలెత్తగా.. అధికార పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఠాణాకు మరోసారి పిలిపించి తిట్టడంతో మనస్తాపం చెందిన సదరు యువకులు పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడున్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ మామిడి వెంకటేశ్ అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. అండగా ఉంటానని పోలీసులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అధికార పార్టీ నాయకుల అండతో అక్రమంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సంబంధిత పోలీస్ అధికారి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామని సతీష్ యాదవ్, ప్రవీణ్ లు స్పష్టంచేశారు. ఈ విషయమై తూప్రాన్ ఎస్ఐ సురేశ్ కుమార్ను వివరణ కోరగా.. ఇరువర్గాలపై ఆరు చొప్పున కేసులు నమోదు చేశామని, విధుల్లో ఉన్న సమయంలో నగదు వసూలు చేసింది ఎవరనే విషయాన్ని తెలుసుకుంటానని చెప్పారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద..
ఇటీవలె ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. తాడేపల్లి సమీపంలోని ఉండవల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి వద్ద తన అవసరం నిమిత్తం రూ.6 లక్షలు తీసుకోగా ఆ వడ్డీ వ్యాపారి వడ్డీ రూపంలో రూ.23 లక్షలు కట్టించుకున్నాడని, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇబ్బంది పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని తన గోడును మీడియా ముందు వ్యక్తపరిచాడు. మొదట వడ్డీ వ్యాపారి తాను తీసుకున్న డబ్బుకు నెలకు రూ.3 వడ్డీ అంటూ చెప్పి, ఆ తరువాత కాల్ మనీ పేరుతో వడ్డీ వసూలు చేశాడని ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోతే నీ అంతు చూస్తానంటూ బెదిరింపులు కూడా చేశాడని, ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వడ్డీ వ్యాపారి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకొని స్టేషన్లో అప్పగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Medak, Petrol, Police station