Missing Cases: హైదరాబాద్ లో వరుస మిస్సింగ్ కేసులు.. నలుగురు యువతుల అదృశ్యం.. విధులు ముగించుకొని వస్తుండగా..
ప్రతీకాత్మక చిత్రం
Missing Cases: వరుసగా పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదవుతుండడంతో హైదరాబాద్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అందులో అమ్మాయిలే అదృశ్యం అవ్వడంతో కలకలం రేపింది. హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మహిళలు కనిపించడం లేదంటూ మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. విధులుకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలా ఈ నెల 22 వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు. దీంతో వీటిపై పోలీసులు ఎక్కువగా దృష్టి సారించారు. కేసులను ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 22 వ తారీఖున యువతి అదృశ్యంపై మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానెహ్రూనగర్కు చెందిన హరిష అలియాస్ పింకీ(25) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఉపయోగం లేకుండా పోయిది. ఈ ఘటనపై ఆమె సోదరుడు మహేష్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిట్లు తెలిపారు. మరుసటి రోజు అంటే ఈ నెల 23 వ తారీఖున బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నర్సు కనిపించడం లేదంటూ కేసు నమోదు అయింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో ఉదయశ్రీ(22) స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. అయితే ఆసుపత్రిలోనే హాస్టల్ లో ఉంటోంది. ఎప్పటిలాగే విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన నర్సు తిరిగి రాలేదు. ఇదే విషయాన్ని హాస్టల్ వార్డెన్ భాగ్యలక్ష్మి ఫోన్ ద్వారా ఉదయశ్రీ తండ్రి వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చింది. ఆందోళన చెందిన అతడు ఖమ్మం జిల్లా నుంచి నగరానికి వచ్చి వెతికాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంగా పోలీసులు తెలిపారు. తర్వాత రోజు ఏప్రిల్ 24న నేరేడ్ మెట్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదయ్యింది. సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్సఫిల్గూడ(మొఘల్ కాలనీ)కి చెందిన ఠాకూర్ రాజేశ్వరి(29) భర్త డ్యూటీకి వెళ్లిన తరువాత ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ నెల 25 మల్కాజిగిరి పోలీసులు యువతి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. ఇందిరా నెహ్రూనగర్కు చెందిన బాలయ్య భార్య కనకలక్ష్మి, కూతురు అరుణ(20) ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్లలో పనిచేస్తున్నారు. ఈ నెల 25న కనకలక్ష్మి తన పనిపూర్తి అయిన తర్వాత కూతురు పనిచేసే చోటుకు 9 గంటలకు వెళ్లింది. ఆ ఇంటి యజమాని అప్పటికే అరుణ వెళ్లిపోయింది అని చెప్పారు. ఆమెకు ఫోన్ చేసినా పనిచేయకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ప్రారంబించినట్లు పోలీసులు తెలిపారు. వరుసగా నాలుగు రోజుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువతులు అదృశ్యం అవ్వడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.