మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు.. మనవత్వం.. జాలీ అన్న పదాలను మరచిపోతున్నట్టు ఉన్నాడు.. అయ్యో పాపం అన్న ఊసే కనిపించడం లేదు కొన్ని సంఘటలను చూస్తే. మనిషి బతికి ఉన్నప్పుడు ఎలా ఉన్నా.. చనిపోయిన తరువాత నలుగురూ తోడుగా వెళ్లి అంత్యక్రియలు నిర్వహించడం అనవాయితీ.. కానీ శ్రీకాకుళంలో మాత్రం చిన్న వివాదం ఓ వృద్ధురాలి మృతదేహాన్ని అనాథగా మిగిలేలా చేసింది.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరుగూడకు చెందిన 65 ఏళ్ల రాయవలస మహలక్ష్మి గురువారం ఆనారోగ్యంతో మృతి చెందింది. అయితే తెలిసినవారు.. సన్నిహిత బంధువుల చివరి చూపుకోసం రాత్రి అంతా ఉంచి ఇవాళ అంత్యక్రియలు చేయాలనుకున్నారు. అంతిమ యాత్ర తరువాత మృతదేహాన్నిమెట్టూరు బిట్-3 నిర్వాసితకాలనీలోని శ్మశానవాటికకు తీసుకువచ్చారు. అక్కడ వరకు అంతా సవ్యంగానే సాగింది. తరువాత అసలు సమస్య మొదలైంది.
ఆ శ్మశాన వాటిక చుట్టుపక్కల ఇళ్లున్నాయని, ఇక్కడ అంత్యక్రియలు చేస్తే ఒప్పుకోమని స్థానికులు అడ్డుపడ్డారు. మెట్టూరుగూడకు నూతనంగా కేటాయించిన శ్మశానవాటికకు మృతదేహాన్ని తరలించాలి అక్కడ అంత్యక్రియలు చేసుకోవాలని కోరారు. ఇళ్ల మధ్య అంత్యక్రియలు చేస్తామంటే ఎలా ఒప్పుకుంటామని నిలదీశారు. అందుకు మెట్టూరువాసులు ఒప్పుకోలేదు. ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తున్న శ్మాశనవాటికను కాదంటే ఎలా అని ఎదరు ప్రశ్నించారు. ఇలా ఒకరితో ఒకరు వాదించుకున్నారు. ఆ వాదన కాస్త ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. అందులో ఎవరూ వెనక్కు తగ్గ లేదు. పంతానికి పోయి కాలనీలోని నడిరోడ్డుపైనే మృతదేహాన్ని వదిలేసి మెట్టుూరుగూడకు చెందిన వారు వెళ్లిపోయారు.
మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలేయడంతో ఆ గ్రమస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు.. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వేరే చోట అంత్యక్రియలు చేసుకోవాలని సూచించారు. కానీ వారు అందుకు ఒప్పుకోలేదు.. పాత శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసుకోనీయండి అంటే స్థానికులు ఒప్పుకోలేదు. ఎవరూ వెనక్కు తగ్గ లేదు.
శ్మశానస్థలాన్ని కొందరు కబ్జా చేశారని.. అందుకే ఇలా అడ్డుపెడుతున్నారని మెట్టూరుగూడకు చెందిన వారు ఆరోపిస్తున్నారు. అయినా కబ్జాదారులకే పోలీసులు అధికారులు వత్తాసుపలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం వేరే ప్రాంతంలో శ్మశానవాటికకు స్థలం కేటాయించమని చాలా రకాలుగా సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. అక్కడ అంత్యక్రియలు జరిపించి తీరుతామని లేదంటే మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోతామని హెచ్చరించారు. ఇలా ఇరు వర్గాలు ఎవరి వాదన వారు వినిపించారు. దీంతో అంత్యక్రియలు లేక ఆ మృతదేహం అలా అనథాగా మిగలాల్సి వచ్చింది. అధికారులు నచ్చజెప్పినా గ్రామస్థులు ససేమిరా అనడంతో వృద్ధురాలి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Srikakulam