news18-telugu
Updated: November 14, 2020, 4:59 PM IST
ప్రతీకాత్మకచిత్రం
ఉదయాన్నే నిద్రలేచిన ఓ వ్యక్తి తన ఇంటి డాబాపైకి వెళ్లాడు. అక్కడ రెండు సంచులు కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఇందులో ఏమున్నాయి? అనుకుంటూనే తెరిచి చూశాడు. అనంతరం షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ సంచుల నిండా డబ్బులు, నగలు ఉన్నాయి. ఏకంగా రూ.40 లక్షల నగదు బ్యాగ్ల్లో కనిపించింది. యూపీలోని మీరట్లో ఈ ఘటన జరిగింది. అంత డబ్బును చూసి కంగారుపడిన ఇంటి యజమాని.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డబ్బును, నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ డబ్బులు ఎవరివి? అక్కడికి ఎలా వచ్చాయో తెలిసింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నేపాల్కు చెందిన రాజు అనే వ్యక్తి మీరట్లో పవన్ సింఘాల్ అనే వ్యాపారి ఇంట్లో పని చేసేవాడు. రెండేళ్ల కిందట అక్కడి నుంచి వెళ్లిపోయి.. ఇటీవలే మళ్లీ నగరానికి తిరిగొచ్చాడు. పని కోసం సింఘాల్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో..ఇదే అదునుగా భావించి.. సెక్యూరిటీ గార్డుతో కలిసి దొంగతనం చేశాడు. ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఐతే వాటిని బయటకు తీసుకెళ్తే.. సీసీ కెమెరాలకు చిక్కుతానని భయపడి.. ఆ ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిపై సంచులను విసిరేశాడు. ఆ తర్వాత వచ్చి తీసుకుందామని సంచులను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు ఉదయం ఆ పక్కింట్లో ఉండే వరుణ్ శర్మ తన ఇంటి డాబాపైకి ఎక్కాడు. అక్కడ రెండు బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో మొదట కంగారు పడ్డాడు. కుటుంబ సభ్యులతో కలిసి బ్యాగ్లను తెరిచి చూస్తే అందులో భారీగా డబ్బులు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి.. కేసును దర్యాప్తు చేస్తున్నారు. పక్కింట్లో దొంగతనం జరిగిందని.. ఆ డబ్బులను ఇక్కడ దాచిపెట్టారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చోరీకి సహకరించిన సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రధాన నిందితుడు రాజును పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 14, 2020, 4:53 PM IST