హైదరాబాద్ సిటీలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ రాజకీయ నేత కూతురు దుర్మరణం చెందారు. సిటీ శివారు శంషాబాద్ పరిధిలోని శాంతంరాయి వద్ద ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్టు నుంచి తిరిగొస్తుండగా, ఐ20 కారు అదుపుతప్పి డివైడర్ ను వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా, లోపలున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువతిని తానియా (24)గా గుర్తించారు. ఆమె తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, హైదరాబాద్ కు చెందిన మైనార్టీ నేత, నాంపల్లి నియోజకవర్గ పార్టీ ఇంచార్జి ఫిరోజ్ ఖాన్ కూతురని పోలీసులు వెల్లడించారు.
తానియా మరో ముగ్గురితో కలిసి కారులో ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తనియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాద సమాచారాన్ని మృతురాలి తండ్రి ఫిరోజ్ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులకు పోలీసులు చేరవేశారు.
ఫిరోజ్ ఖాన్ కూతురు తనియా ప్రయాణించిన కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, కారులోని మిగతా ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆర్జీఐ ఎయిర్పోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Car accident, Congress, Hyderabad, Hyderabad police, Shamshabad, Shamshabad Airport