మంచిర్యాల (Mancherial)జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను తిరస్కరించిందని..తనతో పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో ఓ ట్రాన్స్జెండర్ (Transgender)తనతో పాటు రూమ్ మెట్గా ఉంటున్న యువతిని అత్యంత దారుణంగా కత్తితో గాయపర్చి చంపింది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని ఫారెస్ట్ ఏరియాలో ఈ దారుణం జరిగింది. ట్రాన్స్జెండర్ చేతిలో కత్తిపోట్లకు గురైన యువతి సల్లూరి అంజలి (Salluri Anjali)హాస్పటల్కు తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. అయితే దాడి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్ పెరుగు మహేశ్వరి(Maheshwari) కూడా కత్తిపోట్లకు గురవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే మృతురాలు, దాడి చేసిన ట్రాన్స్జెండర్ మంచిర్యాలలో ఒకే గదిలో ఉంటున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా వేర్వేరు పనులు చేసుకుంటున్నారు.
యువతిని ప్రేమించిన ట్రాన్స్జెండర్..
రెండ్రోజుల క్రితం మంచిర్యాల జిల్లాలో సల్లూరి అంజలి అనే యువతి కత్తిపోట్లకు గురై చనిపోయింది. అంజలి స్వగ్రామం మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామం. మంచిర్యాలలోని ఓ రూమ్లో రెంట్కు ఉంటూ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తోంది. మృతురాలితో పాటు రూమ్లో నెన్నెల మండలం మన్నెగూడెంకు చెందిన పెరుగు మహేశ్వరి (ట్రాన్స్జెండర్), ఆమె చెల్లెలు పరమేశ్వరి, విగ్నేష్ అనే మరో యువకుడు ఉంటున్నారు. అంజలి, పరమేశ్వరి హాస్పిటల్లో పని చేస్తున్నారు. ట్రాన్స్జెండర్ మహేశ్వరి పెట్రోల్ బంకులో పని చేస్తోంది. విగ్నేష్ బేకరిలో పని చేస్తున్నాడు. ఎవరికి వారు వేర్వేరు పనులు చేసుకుంటూ ఒకే గదిలో ఉంటున్నారు.
పెళ్లికి ఒప్పుకోలేదని ..
ట్రాన్స్జెండర్ మహేశ్వరి మృతురాలు అంజలిని ప్రేమిస్తున్నానని..తనను పెళ్లి చేసుకోమని గత కొద్దిరోజులుగా ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈక్రమంలోనే వీళ్లిద్దరూ బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండల పరిధిలోని అటవీ ప్రాంతానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడే ఈవిషయంపై ఘర్షణ పడ్డారు. తనతో పెళ్లికి నిరాకరించిందని ట్రాన్స్జెండర్ మహేశ్వరి అంజలిని కత్తితో పొడిచింది. తీవ్రంగా గాయపడిన యువతిని హాస్పటల్కి తరలిస్తుండగా చనిపోయింది. అదే రోజు రాత్రి 12 గంటలకు విగ్నేష్ మృతురాలి సోదరుడు అశోక్కు ఫోన్ చేసి మహేశ్వరితో గొడవపడి అంజలి పురుగుల మందు తాగిందని చెప్పాడు. వెంటనే ఆసుపత్రికి బయల్దేరిన అంజలి కుటుంబసభ్యులకు అజ్మీర శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి అంజలి, మహేశ్వరి ఒకరిని ఒకరు కత్తులతో పొడుచుకున్నారని ఇద్దరినీ మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళుతున్నామని చెప్పాడు.
వారిపై కూడా అనుమానం..
అందరూ ఆసుపత్రికి చేరుకునే సమయానికి బెడ్పై అంజలి చనిపోయిన ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మరో బెడ్పై ట్రాన్స్జెండర్ మహేశ్వరి ఒంటిపై గాయాలతో ట్రీట్మెంట్ తీసుకుంది. మృతురాలు అంజలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల హత్య జరిగిన అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ హత్య కేసులో విగ్నేష్, అజ్మీర్ శ్రీనివాస్తో పాటు మరికొందరిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mancherial, Telangana crime news