రంగారెడ్డి: మృత్యువు మనిషిని ఎప్పుడు.. ఏరూపంలో కబళిస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటివరకూ ఎంతో సంతోషంగా ఉన్న ఆ మనిషిని, ఆ చుట్టూ ఉన్న వారిని విషాదంలోకి నెట్టేస్తుంది. తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోతుంది. చావుకు చిన్నాపెద్దా తేడా ఉండదు. ఆ యువకుడి వయసు 23 ఏళ్లు. రేపోమాపో పెళ్లి చేసుకోవాల్సిన వయసు. నెలరోజుల క్రితమే తల్లి చనిపోయింది. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబానికి ఈ యువకుడి మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కందుకూరు మండలం రాచులూరు గ్రామానికి చెందిన తిరుగమళ్ల శ్రీనాథ్(23) అనే యువకుడు బేగకరికంచె సమీపంలోని అమెజాన్ కంపెనీ దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రోజూలానే.. ఆదివారం కూడా డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి దగ్గర నుంచి బైక్పై బయల్దేరాడు. కానీ.. ఆ యువకుడికి అదే చివరి మజిలీ అవుతుందని ఆ కుటుంబం కలలో కూడా ఊహించలేదు. శ్రీనాథ్ కంపెనీకి వెళ్లేందుకు బైక్పై వెళుతుండగా.. ఎదురుగా మట్టిలోడ్తో టిప్పర్ వస్తోంది. ఆ టిప్పర్ను గమనించిన శ్రీనాథ్ దానిని తప్పించబోయాడు. కానీ.. ఆ టిప్పర్ శ్రీనాథ్ నడుపుతున్న బైక్పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనాథ్ టిప్పర్ చక్రాల కిందపడి నలిగిపోయాడు. విలవిలలాడిపోతూ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
రోడ్డు ప్రమాదంలో శ్రీనాథ్ చనిపోయాడని తెలిసి అతని తండ్రి, చెల్లి ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ‘మమ్మల్ని వదిలేసి అమ్మ దగ్గరికి వెళ్లిపోయావా’ అంటూ శ్రీనాథ్ చెల్లి రోదించిన తీరు చూపరులను కలచివేసింది. శ్రీనాథ్ చాలామంచివాడని, అందరితో కలుపుగోలుగా ఉంటూ డ్యూటీ చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడని.. అలాంటి కుర్రాడికి ఇలా జరగడం బాధాకరమని స్థానికులు చెప్పారు. శ్రీనాథ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసి గ్రామస్తులు, సన్నిహితులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే ఒక నిండు ప్రాణం పోయిందంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఆ టిప్పర్ డ్రైవర్ భయంతో శ్రీనాథ్కు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే అతనిని అదుపులోకి తీసుకుంటామని.. న్యాయం జరిగేలా చూస్తామని సీఐ కృష్టం రాజు బాధిత కుటుంబానికి హామీ ఇవ్వడంతో శ్రీనాథ్ మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం శ్రీనాథ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికందొచ్చిన కొడుకును ఇలా మృత్యువు కాటేయడం.. నెల రోజుల క్రితమే భార్య కూడా చనిపోవడంతో శ్రీనాథ్ తండ్రి కుమిలిపోతున్నాడు. ఆయనను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. శ్రీనాథ్ చెల్లెలికి కూడా పెళ్లి కాలేదు. చెల్లి పెళ్లి బాధ్యతను కూడా శ్రీనాథ్ తన భుజానికెత్తుకున్నాడు. తండ్రికి చేదోడువాదోడుగా నిలుస్తూ వచ్చిన జీతం డబ్బును జాగ్రత్త చేసేవాడు. అలాంటి శ్రీనాథ్ చనిపోవడం ఆ కుటుంబాన్ని మరింత కుంగదీసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike accident, Rangareddy, Road accident, Telangana crime news, Telangana News