ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో చిన్నారుల అదృశ్యమైన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒకే జిల్లాలో ముగ్గురు చిన్నారులు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 24న రాయవరంలో చైతన్య అనే ఐదేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. చైతన్య తల్లిదండ్రులు లోవరాజు, గంగాభవాని స్థానిక ఇటుక బట్టీల వద్ద పనిచేస్తుంటారు. ఆదివారం బట్టీల వద్ద ఆడుకుంటుండగా చైనత్య కనిపించకుండా పోయాడు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా చైనత్య ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రాయయవరం పరిసర గ్రామాలను జల్లెడపట్టారు. అలాగే తల్లిదండ్రులతో పాటు బంధువులను విచారించారు. బట్టీల వద్ద పనిచేసే సమయంలో ఎవరితోనైనా గొడవలు జరిగాయా..? ఆర్ధిక వివాదాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో విచారణ జరిపారు.
బంధువు పనేనా..?
బాలుడి అదృశ్యం వెనుక బంధువుల పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటుక బట్టీల సమీపంలోని సెల్ టవర్ లో బాలుడి బంధువుకి సంబంధించిన సెల్ ఫోన్ సిగ్నల్ లభించడంతో అతడ్ని విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని అడ్డతీగల సమీపంలోని డొక్కపాలెంకు పంపారు. అలాగే బాలుడు ఆడుకుంటున్న ప్రాంతంలో డ్రెయిన్ ఉండటంతో ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడా? అనే అనుమానంతో కాలువలో రెండు కిలోమీటర్ల పాటు గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
మన్యంలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం
ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం మిస్టరీగా మారింది. మారేడుమిల్లి మండలంలో ఇద్దరు గిరిజన అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మారేడుమిల్లి పంచాయతీ పరిధిలోని మూసూరు గ్రామానికి చెందిన మూడేళ్ల హర్షిణి, రెండున్నరేళ్ల శ్రీ వైష్ణవి ఈనెల 22న అదృశ్యమయ్యారు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఆడుకుంటుండగా కనిపించకుండా పోయినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, East Godavari Dist, Kidnap, Rajahmundry S01p08