ఘజియాబాద్: కొందరిలో నేర ప్రవృత్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒక తప్పు నుంచి బయటపడేందుకు తప్పు మీద తప్పు చేస్తూ పోతున్నారు. చివరకు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ఘజియాబాద్లో కూడా సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. కూతురి మర్డర్ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె తండ్రి మరో తప్పు చేశాడు. మరో వ్యక్తిని చంపి తన దుస్తులు తొడిగి అతనిని దహనం చేశాడు. ఆ మృతదేహం తనదేనని పోలీసులకు చెప్పాల్సిందిగా భార్యకు తన ప్లాన్ను వివరించి చెప్పాడు. భార్య తన భర్త చెప్పినట్టే ఆ మృతదేహం తన భర్తదేనని పోలీసులకు చెప్పింది. అయితే.. పోలీసులు మాత్రం ఈ భార్యాభర్తల కుట్రను బట్టబయలు చేశారు. మరో వ్యక్తిని చంపి ఈ నాటకం ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నవంబర్ 20న ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఓ ప్రదేశంలో ఘజియాబాద్ పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం సగం కాలిపోయి ఉంది. ముఖం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారిని పోలీసులు విచారించగా.. ఆ చనిపోయిన వ్యక్తి తన భర్తేనని, ఎవరో అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని అనుపమ అనే వివాహిత పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త పేరు సుదేష్ అని ఆ మహిళ చెప్పింది. పోలీసులు అనుపమ ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ మృతదేహం దొరికిన చుట్టుపక్కల ఉన్న సీసీకెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సుదేష్ కాల్ డేటాను పరిశీలించారు. ఆ కాల్ డేటాను పరిశీలించగా ఈ జంట కుట్ర బట్టబయలైంది. సుదేష్ 13 ఏళ్ల వయసున్న కన్న కూతురిని హత్య చేశాడని తేలింది. ఈ సమాచారం పోలీసులకు తెలిశాక అనుపమను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనుపమ చెప్పింది విని పోలీసులు షాకయ్యారు. ఆ మృతదేహం అసలు సుదేష్దే కాదని విచారణలో తేలింది. ఆ హత్య చేసిందే సుదేష్ అని తెలిసి పోలీసులు విస్తుపోయారు.
సుదేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎందుకు ఈ హత్య చేశావని ప్రశ్నించగా.. 13 ఏళ్ల వయసున్న తన కూతురుని హత్య చేసిన కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు సుదేష్ ఈ నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు. ఆ చనిపోయిన వ్యక్తి తానేనని భావిస్తే ఈ కేసు నుంచి బయటపడొచ్చనే ఉద్దేశంతో మరొకరిని హత్య చేసి తన చొక్కా, ప్యాంటు తొడిగి ముఖం గుర్తుపట్టకుండా దహనం చేశానని చెప్పాడు. మృతదేహం కాలిపోయిన తర్వాత ప్యాంటు జేబులో ఆధార్ కార్డు ఉంచినట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా.. హంతకుడి భార్య కూడా ఈ హత్యకు భర్తకు సహకరించింది. ఆ మృతదేహం తన భర్తేనని పోలీసులను నమ్మించడమే కాకుండా అంత్యక్రియలు కూడా నిర్వహించింది. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా సుదేష్ మరో వ్యక్తి మృతదేహాన్ని బైక్పై తీసుకెళుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. పోలీసులు భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Crime news, Husband, Wife