నల్గొండ: ఒక ఇంట్లో కన్నం వేసిన దొంగలు మళ్లీ ఆ ఇంటి వైపు కూడా చూడరు. వేరే ఇళ్లను టార్గెట్గా చేసుకుంటుంటారు. ఎందుకంటే.. ఒకసారి చోరీ జరిగిన చోట మళ్లీ దోచుకునేందుకు అనువైన పరిస్థితులు ఉండవని, అప్రమత్తంగా ఉండి నిఘా పెడితే దొరికిపోతామనే భయంతో దొంగలు మళ్లీ ఆ వైపు వెళ్లరు. కానీ.. నల్గొండ జిల్లాలో దొంగల రూటే సపరేటు. ఫిబ్రవరి 2న ఓ ఏటీఎంలో చోరీకి పాల్పడిన దొంగలు ఫిబ్రవరి 7న.. అంటే మళ్లీ సరిగ్గా ఐదు రోజులకే మళ్లీ అదే ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడులో నేషనల్ హైవే నంబర్ 65 పక్కన ఉన్న ఇండిక్యాష్ ఏటీఎంలో ఫిబ్రవరి 2న చోరీ జరిగింది. దాదాపు రూ.2.13 లక్షల డబ్బును దొంగలు దోచుకెళ్లారు. మళ్లీ.. ఫిబ్రవరి 7న ఇదే ఏటీఎంలో రూ.7.3 లక్షల సొమ్మును దొంగలు మాయం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ఏటీఎం నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చెప్పారు. తొలిసారి దొంగతనం జరిగినప్పుడే నిర్వాహకులు అప్రమత్తంగా ఉండి ఉంటే.. మళ్లీ దొంగతనం జరిగి ఉండేది కాదని తెలిపారు. ఇండిక్యాష్ ఏటీఎంను దోచుకున్న తర్వాత చిట్యాల పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎంలో కూడా ఈ ముఠా చోరీకి యత్నించిందని కానీ విఫలమయ్యారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై చిట్యాల సీఐ శివశంకర్ మాట్లాడుతూ.. ఇండిక్యాష్లో అర్ధ రాత్రి 2 గంటల సమయంలో దొంగలు చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలినట్లు తెలిపారు.
వెలిమినేడులో ఓ ఇంటి ముందు పార్క్ చేసిన ఇండికా కారును కూడా దొంగలు చోరీ చేసినట్లు చెప్పారు. అంతేకాదు, చిట్యాలలో క్వాలిస్ కారును కూడా దొంగిలించినట్లు తెలిపారు. హైదరాబాద్ వైపుగా వెళ్లిన దొంగలు పంతంగి టోల్ప్లాజా వద్ద కారును వదిలేసి సొమ్ముతో పరారైనట్లు విచారణలో పోలీసులు తేల్చారు. ఏటీఎం చోరీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. హర్యానా గ్యాంగ్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిట్యాల పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ATM, Crime news, Nalgonda, Robbery