పరవుర్: ఆ ఇద్దరు అక్కాచెల్లెలు కవల పిల్లలు. ఇటీవల చెల్లి మానసిక సమస్యకు లోనైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమెకు తల్లిదండ్రులు తన సోదరిని ప్రేమగా చూసుకోవడం నచ్చలేదు. ఆ ఆలోచన చివరకు ఆమెను హంతకురాలిని చేసింది. సొంత అక్కను కత్తితో పొడిచి చంపేంత క్రూరంగా మార్చింది. ఈ దారుణ ఘటన కేరళలోని నార్త్ పరవుర్ పరిధిలో జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ పరవుర్లోని పనోరమ నగర్కు చెందిన జిజి, శివానంద్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరూ కవల పిల్లలు. పెద్దమ్మాయి పేరు విస్మయ(25), చిన్నమ్మాయి పేరు జీతూ(22).
ఇది కూడా చదవండి: Husband: ఈమె భర్త వయసు 42 సంవత్సరాలు.. ఈ వయసులో అయ్యగారు ఏం చేశారో చూడండి..
గత కొన్ని నెలలుగా జీతూ మానసిక సమస్యతో బాధపడుతోంది. దీంతో.. తల్లిదండ్రులు ఆమెను కొన్నాళ్లు ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయించారు. కొన్ని రోజుల క్రితం ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయితే.. ఆమెకు ఆ మానసిక సమస్య పూర్తిగా నయం కాలేదు. పలుసార్లు కత్తితో పొడుచుకోవడానికి, ఇంట్లో వాళ్లను పొడవడానికి ప్రయత్నించింది. దీంతో.. ఆమెను అలానే వదిలేస్తే తనకు తాను హాని చేసుకోవడమో లేక ఇతరులకు హాని చేయడమో చేస్తుందని భావించిన తల్లిదండ్రులు ఇంట్లో ఉండే ఆమె చేతులను తాళ్లతో కట్టేసేవారు. అన్నం స్వయంగా ఇంట్లో ఎవరు ఉంటే వాళ్లు తినిపించేవారు. కూతురుని అలా కట్టేయడం బాధనిపించినా తప్పని పరిస్థితుల్లో అలా చేసేవాళ్లు. చెల్లి పరిస్థితి చూసి అక్క విస్మయ కూడా కుమిలిపోయింది.
ఇలా ఉండగా.. డిసెంబర్ 28న డాక్టర్తో మాట్లాడేందుకు శివానంద్, జిజి అలువకు వెళ్లారు. ఇంట్లో విస్మయ, జీతూ మాత్రమే ఉన్నారు. జీతూ చేతులను ఆమె తల్లిదండ్రులు కట్టేసి వెళ్లారు. సాయంత్రం 3 గంటల సమయంలో బాత్రూమ్కు వెళ్లాలని, చేతులకు ఉన్న తాడును విప్పాలని జీతూ తన అక్క విస్మయను కోరింది. విస్మయ చెల్లి పరిస్థితి అర్థం చేసుకుని తాడు విప్పింది. బాత్రూమ్కు వెళ్లి వచ్చిన తర్వాత జీతూ విస్మయతో గొడవ పడింది. అమ్మానాన్న నిన్నే బాగా చూసుకుంటారని, నీపైనే ప్రేమ చూపిస్తున్నారని అక్క విస్మయతో జీతూ ఘర్షణకు దిగింది.
విస్మయ అది నిజం కాదని, అమ్మానాన్నకు మనిద్దరంటే ఇష్టమని.. అందుకే నీకు నయం అవ్వాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారని.. ఇప్పుడు కూడా నీ కోసమే డాక్టర్కు కలవడానికి వెళ్లారని విస్మయ తన చెల్లికి చెప్పింది. అయినప్పటికీ వినిపించుకోని జీతూ.. అమ్మానాన్నకు నువ్వంటేనే ఇష్టమని, నేను ఇష్టం లేదని.. నీతోనే బాగా ఉంటున్నారని వాదించిన జీతూ క్షణికావేశంలో కత్తితో విస్మయపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విస్మయ కొంతసేపటికే ప్రాణాలు కోల్పోయింది.
విస్మయను పొడిచిన సమయంలో రక్తం చింది జీతూ బట్టలపై పడింది. దీంతో.. ఆ బట్టలను మార్చుకుని.. రక్తం అంటిన బట్టలను అక్కడే వదిలేసింది. ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టి అక్కడి నుంచి జీతూ వెళ్లిపోయింది. విస్మయ మృతదేహం ఇల్లు తగలబడటంతో మంటల్లో కాలిపోయింది. ఇల్లు కాలిపోవడంతో ఇరుగుపొరుగు వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పాట్కు చేరుకున్నారు. ఇంట్లో విస్మయ మృతదేహం పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన జరిగిన తరువాత జీతూ కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. ఆమె కోసం గాలించి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తన అక్కను తానే కత్తితో పొడిచి చంపేశానని, ఆ తర్వాత ఇంటికి నిప్పంటించి అక్కడి నుంచి వెళ్లిపోయానని జీతూ పోలీసుల విచారణలో అంగీకరించింది. అక్కపై అమ్మానాన్న ఎక్కువ ప్రేమ చూపించడం నచ్చకే ఈ పని చేశానని జీతూ ఒప్పుకుంది. దీంతో.. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Kerala, Murder