నల్గొండ (Nalgonda) జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడలో ఎలక్ట్రిసిటీ డీఈ (Electricity DE) మురళీధర్రెడ్డి ACBకి చిక్కిన కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నల్గొండ, నడిగూడెం, హైదరాబాద్లలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు కనిపించాయి. రూ. కోట్ల విలువైన భూముల కాగితాలు, తోటల వివరాలు, ఆస్తుల దస్తావేజులతో పాటుగా బంగారు, వెండి, డైమండ్ ఆభరణాలు ఏసీబీ అధికారులకు (ACB Officials) కనిపించాయి. వాటన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 100 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మురళీధర్ రెడ్డి మిర్యాలగూడ (Miryalaguda)లో టెక్నికల్ ఏఈగా పనిచేయడంతో పాటుగా, హాలియాలో ఏఈగా, దేవరకొండ ఏడీఈగా, చౌటుప్పల్ డీఈగా పనిచేశారు. దేవరకొండకు చెందిన శివకుమార్ పేరిట బినామీ లైసెన్స్ తెరిచి ఆయన పనిచేసిన ప్రతిచోటా రూ. కోట్లతో పనులు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఎలా దొరికారు..?
లీవ్ రెగ్యులరైజ్ (Leave Regularize) చేసేందుకు లైన్మెన్ నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ డీఈ, యూడీసీ, జేవోలు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ట్రాన్స్కో కార్యాలయంలో మంగళవారం జరిగింది. మిర్యాలగూడ (Miryalaguda)లోని రెడ్డికాలనీ లైన్మెన్ గుంటూరు శ్రీనివాస్ పని చేస్తున్నాడు. తన కుమారుడి అనారోగ్యం కారణంగా 2004 నవంబరు 23 నుంచి సెలవుపై వెళ్లాడు. తిరిగి 2005 నవంబరు 14న పాలకవీడు లైన్మెన్గా విధుల్లో చేరాడు. అయితే 350 సెలవు రోజుల లీవ్ రెగ్యులరైజేషన్తోపాటు, ఇంక్రిమెంట్లు (Increment), లీవ్ పీరియడ్కు సంబంధించిన రూ.7 లక్షల ఎరియర్స్ ఇస్తూ పదోన్నతి కల్పించాలని శ్రీనివాస్ డీఈ (DE)కి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డీఈ మురళీధర్రెడ్డి, యూడీసీ లతీఫ్, జేవో దామోదర్లు రూ.7 లక్షల లంచం డిమాండ్ చేశారు.
రెడ్ హ్యాండెడ్గా..
ఆ మొత్తాన్ని మూడు విడతలుగా చెల్లిస్తేనే ఫైల్ (File) కదులుతుందని తెగేసి చెప్పారు అధికారులు. దీంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను (ACB Officials) ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మొదటి విడతగా రూ.2లక్షల నగదుతో డీఈ చాంబర్కు వెళ్లాడు. అక్కడ మురళీధర్రెడ్డి. లతీఫ్, దామోదర్లతో కలిసి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కాగా, ఏసీబీ దాడి (ACB Raids)లో పట్టుబడ్డ అధికారుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నల్లగొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చిన 45 మంది అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దాడులు (ACB Raids in Nalgonda) నిర్వహించారు. హైదరాబాద్లో మురళీధర్రెడ్డికి చెందిన ఇంట్లో, నల్లగొండలోని లతీఫ్, దామోదర్ ఇళ్లలో సోదాలు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ACB, Miryalaguda, Nalgonda