తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్తో దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలిన గాయాలతో ఉన్న మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. టేక్మాల్ మండలం అంతాయిపల్లి తండాకు చెందిన చత్రుభాయ్పై(40) కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో దాడి చేశారు. మార్కెట్కు వెళ్లి వస్తున్న సమయంలో అల్లదుర్గ్ మండలం గడిషెడ్డపుర్ వద్ద ఆమెను అడ్డుకుని యాసిడ్ పోశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే తెల్లవారుజాము వరకు ఆమెను ఎవరూ గుర్తించకపోవడంతో.. ఆమె అక్కడే పడి ఉంది.
ఇక, తెల్లవారుజామున ఆమెను గుర్తించిన స్థానికులు.. బంధువుల సహాయంతో ఆమెను జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆమె పరస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. మహిళ రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కఠిన చర్యలు అవలంభిస్తున్నా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం భయాందోళనలు కలిగిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.