క్షణికావేశంలో ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. పాఠశాలలలో టీచర్ మందలించాడనే కారణంతో మనస్తాపం చెందిన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. కుల్కచర్ల మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన పోలేపల్లి పెంటయ్య, నర్సమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు హరికృష్ణ (16) సాల్వీడ్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. కరోనా పరిస్థితుల కారణంగా ఇన్ని రోజులు ఆన్లైన్ క్లాసులు జరగగా.. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో 2వ తేదీన హరికృష్ణ పాఠశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో క్లాస్ టీచర్ రమేశ్ విద్యార్థులంతా అంగీకారపత్రాలు తీసుకురావాలని సూచించారు. అలాగే గతంలో హరికృష్ణ పాఠశాలకు సక్రమంగా వెళ్లేవాడు కాదని, ప్రస్తుతం పదో తరగతి కావడంతో క్రమం తప్పకుండా స్కూలుకు రావాలని ఉపాధ్యాయులు మందలించినట్లు సమాచారం.
దీంతో మనస్తాపం చెందిన శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరికృష్ణ దూలానికి ఉరి వేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా.. అక్కడ ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. "నా చావుకు కారణం రమేశ్ సార్.. రమేశ్ సార్ నన్ను పాఠశాలకు రావొద్దని బెదిరించాడు. ఇంటి వద్దే ఉండి టీవీలో పాఠాలు విని పరీక్షలు రాయాలి.. స్కూల్కు వస్తే కొడతాను. ఇంటి వద్ద ఉంటే స్కూల్కు ఎందుకు వెళ్లలేదు అని అడుగుతున్నారు.. నా చావుకు రమేశ్ సార్ కారణం" అని హరికృష్ణ అందులో రాశాడు.
దీంతో హరికృష్ణ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ విషయం తెలియడంతో శనివారం మధ్యాహ్నం జిల్లా విద్యాధికారిణి (డీఈఓ) రేణుకాదేవి పాఠశాలను సందర్శించారు. విద్యార్థి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి హరికృష్ణ గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు సేకరించి నివేదిక పంపించాలని ఆమె మండల విద్యాధికారికి సూచించారు.