ఓ ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తెలంగాణ పోలీసులతో పాటు బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి, సీబీఐ అధికారులకు నోటీసులు పంపింది. 2019 అక్టోబరులో BHEL ఉద్యోగిని నేహా చౌస్కి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మియపూర్లోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకొని చనిపోయారు. ఉన్నతస్థాయి అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో రాశారు. ఐతే కేసును తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని.. సీబీఐ దర్యాప్తు చేయాలని మృతురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు తెలంగాణ పోలీసులకు నోటీసులు పంపింది. నేహా చౌస్కి సూసైడ్ నోట్లో ఉన్న ఎనిమిది మందిని మియపూర్ పోలీసులు ఎందుకు విచారించలేదని నోటీసుల్లో పేర్కొంది. ఈ ఘటన తర్వాత బీహెచ్ఈఎల్ అధికారులు, సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుందో వివరణ ఇవ్వాలని సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించింది. అటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న మహిళ.. అధికారుల వేధింపులతో చనిపోయిందని ఫిర్యాదు అందినా.. ఎందుకు స్పందించలేదని సీబీఐకి కూడా నోటీసులు జారీచేసింది.
కాగా, మధ్యప్రదేశ్కు చెందిన 33 ఏళ్ల నేహ హైదరాబాద్లో శివారులోని బీహెఎచ్ఈఎల్లో పనిచేసేవారు. భోపాల్ నుంచి బదిలీ కావాలని కోరి మరీ నగరానికి వచ్చారు. హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి మియాపూర్లోని ఓ అపార్ట్మెంట్ నివసించేవారు. సహ ఉద్యోగులు, ఉన్నతాధికారులు వేధిస్తున్నారన్న కారణంతో.. గత ఏడాది అక్టోబర్ 17న ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని నేహ మరణించారు. భోపాల్లో పని చేసినప్పుడు అక్కడి సహోద్యోగులు వేధించేవారని.. అందుకే బదిలీ చేయించుకుని ఇక్కడకు వచ్చామని, ఇక్కడ కూడా అదే తంతు అని నేహా భర్త గత ఏడాది కన్నీళ్లు పెట్టుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BHEL, Crime news, Hyderabad, Telangana, Telangana Police