స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India)కి చెందిన ఓ బ్రాంచ్లో భారీ సంఖ్యలో నాణేలు (Coins Missing) మాయమయ్యాయి. దీంతో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (SBI)... సీబీఐ(CBI)ని ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ (Rajasthan)లోని మెహందీపూర్ బాలాజీ (Mehandipur Balaji)లోని ఎస్బీఐ బ్రాంచ్లోని వాల్ట్స్ (Vaults) నుంచి ఏకంగా రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్బీఐ ఖంగు తిన్నది. అనంతరం ఈ వ్యవహారంపై సీబీఐ (Central Bureau of Investigation) విచారణ కోరుతూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది.
ఎస్బీఐ నుంచి కనిపించకుండా పోయిన మొత్తం డబ్బు విలువ రూ.3 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. సీబీఐ ఏజెన్సీ ద్వారా విచారణ కోరే థ్రెషోల్డ్ కంటే ఇది ఎక్కువ. దీంతో రాజస్థాన్ హైకోర్టు ఈ విషయంపై విచారణ జరపాల్సిందిగా సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిందని బ్యాంక్ అధికారులు సోమవారం తెలిపారు. ఇప్పటికే సీబీఐ రాజస్థాన్ పోలీసులు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR)ను స్వాధీనం చేసుకుంది.
* ఈ భారీ తేడాను ఎలా గమనించారు
ప్రాథమిక విచారణలో బ్యాంక్లో నగదు నిల్వలో తేడా ఉన్నట్లు ఎస్బీఐ మెహందీపూర్ బాలాజీ బ్రాంచ్ గుర్తించింది. ఈ తేడా ఎక్కడ వచ్చిందో తెలుసుకునేందుకు బ్రాంచ్ ఉన్నత అధికారులు డబ్బుల లెక్కింపును చేపట్టాలని నిర్ణయించారు. ఈ లెక్కింపు సందర్భంగా రూ. 11 కోట్ల విలువైన నాణేలు మాయమైనట్లు తెలియవచ్చింది. బ్రాంచ్ అకౌంట్ బుక్స్ ప్రకారం, రూ.13 కోట్లకు పైగా విలువైన నాణేల లెక్కింపును చేపట్టడానికి జైపూర్కు చెందిన ఒక ప్రైవేట్ వెండర్ను నియమించారు. అయితే ఈ కౌంటింగ్లో రూ.11 కోట్లకు పైగా నాణేలు మాయమైనట్లు తేలింది. 3,000 నాణేల సంచులలో కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఉన్నాయని, మిగతా రూ.11 కోట్లు మిస్ అయినట్లు ప్రైవేట్ వెండర్ తేల్చారు. దీనితో ఇవి ఎక్కడికెళ్ళాయి? వీటిని ఎవరైనా దొంగిలించారా అనే విషయాన్ని తేల్చాలని ఎస్బీఐ సీబీఐని కోరింది.
అయితే రూ.2 కోట్లు విలువైన నాణేలను ఆర్బీఐ (RBI) కాయిన్ హోల్డింగ్ శాఖకు బదిలీ చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, 2021 ఆగస్టు 10వ తేదీన రాత్రి సమయంలో ప్రైవేట్ వెండర్ ఉద్యోగులు ఒక గెస్ట్హౌస్లో నాణేలను లెక్కించడం ప్రారంభించారు. అయితే ఈ గెస్ట్హౌస్లోని కొందరు ఈ కౌంటింగ్ను మానుకోవాలని ఉద్యోగులను బెదిరించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఈ వివరాలను పరిగణలోకి తీసుకొని ఆ కోణంలో కూడా సీబీఐ విచారణ జరుపుతోంది. ఇంత మొత్తంలో డబ్బు మాయం చేసిందెవరో త్వరలోనే సీబీఐ తెలుసుకుంటుందని బ్యాంకు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.