అదో వీధికుక్క... రోడ్డు మీద తినడానికి ఏమీ దొరుకుతుందా...అని ఆశగా ఎదురుచూసే శునకం. దొరికిన దాన్ని తింటూ బతికేసే ఆ కుక్క... ఓ బాంబును తినే పదార్థం అనుకుని, నోట్లు పెట్టుకుని కొరికేసింది. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన ఈ సంఘటన తెలంగాణ సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో నాటుబాంబు కలకలం క్రియేట్ చేసింది. అన్నారం గ్రామంలో గ్రామస్థులు వేసిన ఆహారాన్ని తింటూ జీవించే ఓ కుక్క... రోడ్డు పక్కన ఓ వస్తువు పడి ఉండడాన్ని గమనించింది. అది తినే వస్తువు అనుకుని, నోట్లో పెట్టుకుని కొరికేసింది. అంతే... పెద్ద శబ్దంతో పేలిపోయిందా వస్తువు. పేలుడు ధాటికి ఆ కుక్క... అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు పక్కన బాంబు పేలుడు జరగడంతో గ్రామస్థులు... భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... డాగ్ స్క్వాడ్తో కలిసి సంఘటన స్థలంలో తనిఖీలు చేపట్టారు.
గ్రామంలోకి బాంబు ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు? లేక ఊర్లో ఉండే వ్యక్తులే బాంబును తయారుచేశారా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కుక్క కొరికింది కాబట్టి సరిపోయింది కానీ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు అని భ్రమించి, బాంబుతో ఆడుకున్నా... లేక కుర్రకారు దాంతో ఆటలాడినా తీవ్రత మరేలా ఉంటుందని వాపోతున్నారు గ్రామస్థులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb blast, Crime, Telangana