Chinthakindhi.RamuChinthakindhi.Ramu
|
news18-telugu
Updated: April 30, 2019, 8:20 PM IST
చెప్పినా వినకుండా ఫ్యాషన్ షోకు వెళ్లిందని భార్యను అతిదారుణంగా...
వద్దని చెప్పినా వినకుండా ఫ్యాషన్ షోకు వెళ్లిందనే కోపంతో భార్యపై కాల్పులకు తెగబడ్డాడో భర్త. హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం క్రియేట్ చేసింది. గురుగ్రామ్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది 32 ఏళ్ల ఆశారాణి. గత ఆదివారం స్కూల్ యాజమాన్యం సమీపంలో ఉన్న సిటీ క్లబ్లో టీచర్ల కోసం ప్రత్యేకంగా ఓ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో ఫ్యాషన్ షోను కూడా ఏర్పాటు చేసింది. పార్టీకి వెళ్లడానికి ఒప్పుకున్న ఆశారాణి భర్త ఇంద్రజిత్... ఆ తర్వాత ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి మాత్రం ఒప్పుకోలేదు. పార్టీ అయిపోగానే తిన్నగా ఇంటికి రావాలని చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఆదివారం ఉదయం పార్టీకి వెళ్లిన ఆశారాణి... రాత్రి 11 గంటలు దాటినా ఇంటికి రాలేదు. దాంతో అనుమానంతో స్కూల్కు వెళ్లిన ఇంద్రజిత్... అక్కడ ఆమె లేకపోవడంతో ఫోన్ చేసి ఎక్కడున్నావని నిలదీశాడు.
అప్పటికే ఆలస్యం కావడంతో భర్త బైక్ మీద ఇంటికి వెళ్లొచ్చని ఆశపడిన ఆశారాణి... పార్టీ జరుగుతున్న క్లబ్ అడ్రెస్ను వాట్సాప్లో షేర్ చేసింది. పార్టీ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్న ఇంద్రజిత్... అక్కడ ర్యాంపు మీద వయ్యారంగా నడుస్తున్న భార్యను చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే స్టేజ్ ఎక్కి, ఇంటికి వెళ్దామని బలవంతం చేయబోయాడు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో వెంట తీసుకొచ్చిన గన్తో ఆమెపై దాడికి దిగాడు. గన్తో మొదట టీవీ స్క్రీన్ను కాల్చేసిన ఇంద్రజిత్... ఆ తర్వాత ర్యాంప్పై ఉన్న భార్య కాళ్లను కాల్చాడు. భర్త కోపాన్ని చూసి, చంపేస్తాడని భావించిన ఆశారాణి... భయంతో అలాగే పరుగులు తీసింది. ఆమెను గన్తో క్లబ్ మొత్తం వెంబడించాడు భర్త. ఇంద్రజిత్ చేస్తున్న పనిని చూసి కూడా ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు తోటి ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యం. క్లబ్లో పని చేసే ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... గాయాలపాలైన టీచర్ ఆశారాణిని ఆసుపత్రిలో చేర్పించి, ఇంద్రజిత్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
Published by:
Ramu Chinthakindhi
First published:
April 30, 2019, 8:19 PM IST