ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి. తజాగా జరిగిన ఓ ఘటనలో మహిళా అధికారిపైనే లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్లోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల ఓ మహిళా అధికారిణి కోయంబత్తూరు రెడ్ఫీల్డ్ ఎయిర్ఫోర్స్ ట్రెయిన్ కాలేజీలో కొన్ని నెలలుగా శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఆట సమయంలో ఆమె గాయపడ్డారు. గాయానికి చికిత్స పొంది, తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆమె నిద్ర లేచి చూశాక.. తనపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించించారు. అదే కాలేజీలో శిక్షణ పొందుతున్న చత్తీస్గఢ్కు ఫ్లైట్ లెఫ్టినెంట్ 29 ఏళ్ల అమరేందర్ ఆమె గదిలోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై బాధితురాలు తొలుత వాయుసేన అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె స్థానిక గాంధీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లైట్ లెఫ్టినెంట్ను అరెస్ట్ చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా... రెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుత ఉదుమాల్పేట్ జైలుకు తరలించామన్నారు.
నిందిత అధికారిపై సెక్షన్ 376 కింద కేసు నమోదుచేశామని కోయబత్తూరు పోలీస్ అధికారి దీపక్ దమన్ తెలిపారు. అతడిని పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతామన్నారు. ఇదిలా ఉండగా..ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది సాయుధ దళాల సిబ్బందిని అరెస్టు చేయడం స్థానిక పోలీసుల పరిధిలోకి రాదని తెలిపారు. దానిపై స్పందించిన పోలీసుల అధికారులు అరెస్టు పరిధిపై చర్చ జరుపుతున్నామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime