మహిషి: ఆ యువతీయువకుడు ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో.. వెళ్లిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులను కాదనుకుని వెళ్లి ప్రియుడిని నమ్మి పెళ్లి చేసుకున్న ఆ యువతి జీవితం పెళ్లి జరిగిన నెలన్నరకే ముగిసిపోయింది. కట్నం కోసం భర్త, అత్తింటి వారు వేధించసాగారు. ఈ క్రమంలోనే ఆ యువతి అత్తింట్లో అనుమానాస్పద రీతిలో చనిపోయి కనిపించింది. ఈ ఘటన బీహార్లోని మహిషి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిషి పోలీస్ స్టేషన్ పరిధిలోని పస్తవర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మధుబని జిల్లా ఘోగర్దిహ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపట్టి గ్రామానికి చెందిన రామచంద్ర పాశ్వాన్ కుమార్తె కామిని కుమారి. 21 ఏళ్ల ఈ యువతి పస్త్వర్ గ్రామానికి చెందిన మనీష్ కుమార్ అనే యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు కూడా ఈ యువతిని ఇష్టపడ్డాడు. గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ప్రేమ జంట పెద్దలకు తెలియకుండా వీళ్లిద్దరూ సరదగా సినిమాలకు, షికార్లకు వెళుతుండేది. ఇద్దరూ మేజర్లే కావడంతో ఇటీవల పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పారు.
ఇరు కుటుంబాలు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాయి. మనీష్ కుటుంబమైతే కామినిని కోడలుగా అంగీకరించేందుకు ససేమిరా అనడంతో మనీష్, కామిని ఇంట్లో నుంచి వెళ్లిపోయి అక్టోబర్ 21, 2021న గుడిలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న మనీష్ కామినితో కలిసి సహర్సాలోని ఓ హోటల్లో పది రోజుల పాటు ఉన్నాడు. ఎట్టకేలకు కొద్దిరోజుల క్రితం భార్యను తీసుకుని మనీష్ ఇంటికి వెళ్లాడు. మూడు నాలుగు రోజులు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి అత్తింటి నుంచి కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. కామిని తనను ఇలా కట్నం కోసం వేధిస్తున్నారని భర్తకు చెప్పుకునేందుకు ప్రయత్నించగా అతను కూడా వాళ్లతో కలిసి ఆమెను కట్నం కోసం వేధించసాగాడు.
మనీష్, అతని తల్లి, సోదరుడు రాజీవ్, అతని భర్త కామినిని వేధింపులకు గురిచేశారు. అమ్మానాన్నలను కాదనుకుని మనీష్ను నమ్మి పెళ్లి చేసుకుంటే ఇలా జరగడం పట్ల కామిని తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఆమెకు పాపం ఏడుపే మిగిలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నుంచి ఆప్యాయత కరువైంది. కూతురిలా చూసుకోవాల్సిన అత్త కట్నం కోసం వేధిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఆమెను తీవ్రంగా బాధించాయి. ఇలాంటి బాధలు పడుతున్నానని పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరైన స్పందన లేదు. తాము చూసుకుంటామని హామీ ఇచ్చారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఉమెన్ హెల్ప్లైన్కు ఫోన్ చేసి సాయం కోరింది. కానీ.. ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో.. కామినికి ఎటు చూసినా అంధకారమే కనిపించింది. ఈ క్రమంలో మంగళవారం నాడు కామిని అత్తారింట్లో శవమై కనిపించింది. విషం తాగి చనిపోయినట్లు అత్తింటి వారు చెబుతున్నప్పటికీ ఆమెకు విషం పెట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే వాదన కామిని తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. ఏదేమైనా ఈ ఘటన కామిని కుటుంబానికి కడుపు కోత మిగిల్చింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Love marriage, Lovers, Marriage