విశాఖపట్టణం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమార్తె ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని వారు ఆలస్యంగా గుర్తించారు. గంట శ్రీనివాసరావు కుమార్తె కుటుంబం ఇంట్లో లేని సమయాన్ని చూసి దుండగులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఓ ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత కుటుంబం రుషి కొండలోని బాలాజీ బేమౌంట్ విల్లాలో ఉంటున్నారు. ఆమె అత్తగారిది తూర్పు గోదావరి జిల్లాలోని భీమవరం. ఈ నెల పదో తారీఖున ఆమె తన కుటుంబ సమేతంగా అత్తారింటికి వెళ్లింది. ఆ తర్వాత మరుసటి రోజే తిరిగి విశాఖకు వచ్చినా, తమ విల్లాకు వెళ్లకుండా తండ్రి గంటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇన్ని రోజుల పాటు తండ్రి గంటా ఇంట్లోనే సాయి పూజిత కుటుంబం ఉంది. ఓ వస్తువు అవసరమయి ఈ మంగళవారం నాడు ఒకరిని బాలాజీ బేమౌంట్ విల్లాకు పంపించారు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లిన ఆ వ్యక్తికి చోరీ జరిగిన విషయం అర్థమయింది. దీంతో ఇంట్లో వాళ్లకు సమాచారం అందించారు. పూజిత కుటుంబం వచ్చి అంతా పరిశీలించారు. పది లక్షల విలువ చేసే బంగారం, డైమండ్ చెవి దిద్దులు, కొన్ని వెండి వస్తువులను చోరీ చేసినట్టు తేల్చారు. దీంతో చోరీ ఘటన విషయపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇంట్లోనే పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, గంటా శ్రీనివాసరావు గత కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఈ విషయాన్ని గంటా శ్రీనివాసరావు కూడా ఖండించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గంటా రాకను విశాఖలోని వైసీపీలో ముఖ్య నాయకులు వ్యతిరేకిస్తున్నారనీ, అందుకే ఆయన రాకపై తీవ్ర జాప్యం జరుగుతోందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గంటా రాక వల్ల విశాఖలో టీడీపిని మరింత బలహీనం చేయొచ్చునన్నది వైసీపీ ముఖ్యుల అంచనా. అయితే అదే సమయంలో గంటా రాకను వ్యతిరేకించేవాళ్ల అభిప్రాయం వేరుగా ఉంది. ఆయన రాక వల్ల పార్టీకి నష్టమే కానీ, లాభం లేదని చెప్పుకొస్తున్నారు.
Published by:Hasaan Kandula
First published:January 21, 2021, 07:58 IST