Road Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. రహదారులు రక్తమోడుతున్నాయి. ముఖ్యంగా కూలీల పాలిట ప్రమాదాలు యమపాశంగా మారుతున్నాయి. వానాకాలం సీజన్ ఊపందుకోవడంతో చేతినిండా పనులు అని సంబర పడుతున్న వేళ ఈ ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లా (Satya Sai District)లో జరిగిన ప్రమాదం భయపెట్టింది. ప్రతిరోజులాగే గురువారం కూడా ఎంగేజ్ ఆటోలో ప్రయాణిస్తోన్న వారిని అనూహ్యంగా మృత్యువు కబళించింది. హైటెన్షన్ విద్యుత్ వైరు ఒక్కసారిగా తెగిపడి ఆటోపై పడటం.. ఆటో నిలువునా తగలబడిపోవడం.. అందులోని 8 మంది సజీవదహనం కావడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది.. తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో ఉదయం వ్యవసాయ పనుల కోసం ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోపై.. హైటెన్షన్ కరెంట్ తీగలు తెగిపడ్డాయి దీంతో వారంతా సజీవ దహనమైంది. కొన్ని గంటల వ్యవధిలోనే ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రోడ్డుపై వాకింగ్ (walking) చేస్తున్న వ్యక్తిని తప్పించబోయిన బస్సు డ్రైవర్.. ఎదురుగా వస్తున్న లారీ (lorry)ని ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటన బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలో జరిగింది. బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వాకింగ్ చేస్తున్న వ్యక్తి బస్సు కింద పడి మృతిచెందాడు.
స్థానికులు వెంటనే పోలీసులకు, ఆంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బాధితులను దగ్గరలోని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరినైతే తప్పించబోయి బస్సు ప్రమాదానికి గురైందో.. ఆ వ్యక్తి అదే బస్సు కింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. అతని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బస్సు విజయవాడ (Vijayawada) నుంచి అనంతపురం (Ananthapuram) వెళ్తుండగా ఈ ఘటన జరగినట్లు పోలీసులు తెలిపారు. లారీని ఢీకొని బస్సు రోడ్డుకు అడ్డంగా బోల్తాపడడంతో… జాతీయ రహదారి (National Highway) పై ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బస్సును అధికారులు క్రేన్ సహాయంలో తొలగిస్తున్నారు.
ఇదీ చదవండి : అక్కడ వైసీపీ నేతల మధ్య విబేధాలకు ఆయనే కారణమా..? రాజీనామాల పర్వం.. వెనుక మ్యాటర్ అదే!
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అటు కర్నూలు జిల్లాలోనూ మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి పత్తికొండకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Prakasham dist, Road accidents