సమాజంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ముందుగా పోలీసులను ఆశ్రయిస్తారు. ఆపై న్యాయస్థానం తలుపుతడతారు. అలాంటిది న్యాయమూర్తే అకృత్యానికి పాల్పడితే.. నేరాలపై తీర్పులు చెప్పే ఆయనే చిన్న పిల్లల పాలిట కీచకుడైతే.. అదీ చాలదన్నట్లు, తన పవన్ ఉపయోగించి చెడ్డ పనుల కోసం పోలీసులను వాడుకుంటే.. బాధితుల పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో జరిగింది. దేశ న్యాయ చరిత్రలో దాదాపు తొలిసారిగా ఒక జడ్జి పోక్సో ఆరోపణలపై పదవి కోల్పోయాడు. ఆ న్యాయమూర్తి తన సిబ్బందితోకలిసి ఓ బాలుడిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. రాజస్థాన్, భరత్ పూర్ జిల్లా పరిధిలోని మథురా గేట్ పట్టణ పోలీసులు చెప్పిన వివరాలివి..
రాజస్థాన్ లో అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) కేసులను పర్యవేక్షించే ప్రత్యేక కోర్డు జడ్జి జితేంద్ర సింగ్ గోలియా, అతని ఆఫీసులో స్టెనోగా పనిచేసే అన్షుల్ సోని, మరో సహాయకుడు రాహుల్ కటారాపై పోక్సో, ఇతర చట్టాల కింద గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. 14ఏళ్ల బాదిత బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మథురా గేట్ పోలీసులు ఆదివారం నాడు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా నమోదైన వెంటనే.. ఏసీబీ జడ్జి జితేంద్రను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అంతేకాదు, బాధితుణ్ని బెదిరించినందుకు ఏసీబీకి చెందిన ఓ అధికారినిసైతం సస్పెండ్ చేశారు.
బాధిత బాలుడి తల్లి చెప్పిన కథనం ప్రకారం.. భరత్ పూర్ జిల్లా కేంద్రంలో నివసించే జడ్జి జితేంద్ర ప్రతిరోజూ కోర్టు సమయం ముగిసిన వెంటనే తన సహాయకులైన అన్షుల్, రాహుల్ తో కలిసి టెన్నిస్ మైదానానికి వెళుతుంటారు. కొన్ని రోజుల కిందట టెన్నిస్ మైదానంలోనే వారికి ఓ 14ఏళ్ల బాలుడు పరిచయం అయ్యాడు. నలుగురూ కలిసి టెన్నిస్ ఆడేవాళ్లు. ఈక్రమంలోనే వాళ్లు బాలుడికి మద్యం కూడా తాగించేవాళ్లు. వ్యవహారం మరింత ముదిరి బాలుడికి డ్రగ్స్ కూడా అందించేవాళ్లు.
బాలుడు డ్రగ్స్ మత్తులోకి జారుకోగానే జడ్జి జితేంత్ర, మరో ఇద్దరు కలిసి అతనిపై అత్యాచారానికి పాల్పడేవాళ్లు. ఈ గ్యాంగ్ రేప్ ఉదంతం నెలలపాటు కొనసాగింది. టెన్నిస్ ఆడటానికి వెళుతోన్న కొడుకు రోజురోజుకూ నీరసించిపోతుండటంతో తల్లికి అనుమానం వచ్చి నిలదీసింది. దీంతో బాలుడు అసలు విషయాన్ని చెప్పేశాడు. గ్యాంగ్ రేప్ గురించి ఎవరికైనా చెబితే ప్రాణాలు తోడేస్తానని జడ్జిగారు బెదిరించిన విషయాన్ని కూడా తల్లికి చెప్పాడా బాలుడు. కొడుకు మాటలు విని షాకైన తల్లి.. భరత్ పూర్ బాలల సంక్షేమ సంఘం సహాయంతో జడ్జిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలుడికి మత్తు పదార్థాలు ఇచ్చి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఉదంతం బయటపడటంతో ఆ జడ్జి తన పవన్ ఉపయోగించి బాధితులపైకి పోలీసులను పంపాడు. తాను ఏ కేసులైతే పర్యవేక్షిస్తాడో, ఆ ఏసీబీ అధికారులనే బాలుడి ఇంటికి పంపి గ్యాంగ్ రేప్ ఆరోపణలు వట్టిదేనని చెప్పాల్సిందిగా బెదిరిపులకు పాల్పడ్డాడు. తమ ఫిర్యాదులో ఏసీబీ అధికారి బెదిరింపులను సైతం బాధితులు పేర్కొన్నారు. అత్యంత హేయమైన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రాజస్థాన్ హైకోర్టు సైతం జోక్యం చేసుకుని జడ్జి జితేంద్రను తొలగించడంతోపాటు బాధితులను బెదిరించిన ఏసీబీ అధికారిని సస్పెండ్ చేసింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి నిజానిజాలు వెలికి తీస్తామని పోలీసులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gang rape, National News, Posco case, Rajasthan