గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) గ్వాలియర్లో(Gwalior) ఇండియన్ రైల్వే హెల్త్ సర్వీస్(IRHS)లో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. విషాన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుని మరీ ఆ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న ఆ వైద్యుడు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. భార్య, ఆమె తండ్రి వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ సూసైడ్ నోట్లో బాధిత వైద్యుడు పేర్కొన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్వాలియర్లోని పటేల్ నగర్లో నివాసముంటున్న డాక్టర్ గౌరవ్ కుమార్ గుప్తా రైల్వే హాస్పిటల్లో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి డాక్టర్ గౌరవ్ తన స్నేహితుడైన డాక్టర్ మహేంద్రను కలిశాడు. డాక్టర్ మహేంద్ర నర్సింగ్ హోం నడుపుతున్నాడు. ఆ నర్సింగ్ హోంలోనే ఇద్దరూ కలిశారు.
ఆ సందర్భంలో మిత్రుడితో డాక్టర్ గౌరవ్ తన గోడును వెల్లబోసుకున్నాడు. తన ఆలోచన స్థిమితంగా లేదని, నర్సింగ్ హోంలోనే ఉంటానని చెప్పాడు. గౌరవ్ పరిస్థితి చూసిన మహేంద్ర సరేనని చెప్పి.. ధైర్యంగా ఉండమని చెప్పి ఆ రాత్రి ఇంటికెళ్లిపోయాడు. మంగళవారం సాయంత్రం డాక్టర్ మహేంద్ర తన నర్సింగ్ హోంకు తిరిగొచ్చేసరికి గౌరవ్ నర్సింగ్ హోంలోని ఒక రూమ్లో బెడ్పై పడిపోయి కనిపించాడు. అతనికి పక్కనే సిరంజీ, ఇంజెక్షన్ కనిపించాయి.
గౌరవ్ తనకు తాను ఇంజెక్షన్ చేసుకున్నట్లు మహేంద్ర గుర్తించాడు. గౌరవ్ పాయిజన్ను శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుని చనిపోయినట్లు తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. గౌరవ్ చనిపోయిన దగ్గరే నాలుగు పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. తన భార్య షైలీ, మామ డాక్టర్ ఎంఎల్ గుప్తా, మరదలు నేహా తనను వేధింపులకు గురిచేశారని.. ఆ వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్లో గౌరవ్ రాశాడు. తాను కట్నం కోసం వేధిస్తున్నానని తనపై తప్పుడు కేసు బనాయించి.. తన భార్యతో పాటు అత్తింటి వారు వేధిస్తున్నారని.. తనకు మానసిక ప్రశాంతత లేకుండా చేసి నరకం చూపిస్తున్నారని గౌరవ్ లేఖలో తెలిపాడు.
సూసైడ్ నోట్ మొత్తం ఇంగ్లీష్లో రాసిన గౌరవ్ తను పడుతున్న మనోవేదనను వ్యక్తపరిచే ప్రయత్నం చేశాడు. ‘నేను మీ కాళ్లూచేతులు పట్టుకుని బతిమాలాను. ప్రాధేయపడ్డాను. కానీ మీరెవరూ నా గోడును పట్టించుకోలేదు. కట్నం కోసం వేధిస్తున్నానని నాపై తప్పుడు కేసు పెట్టారు. నన్ను వేధించారు. నేహాకు, ఆమె భర్తకు ఏప్రిల్లో కరోనా సోకితే.. వాళ్లను నేను నా కారులో నోయిడా నుంచి తీసుకొచ్చాను. నేహా భర్తను అపోలోలో చేర్చాను. వైద్య ఖర్చులు మొత్తం నేనే పెట్టుకున్నాను. అందుకు ప్రతిఫలంగా మీరంతా నన్ను మోసం చేశారు. నా ఫోన్లో కొన్ని ఫుటేజ్లున్నాయి. ఈ బాధను నేను ఇంక భరించలేను. లోలోపల నేను కుమిలిపోయాను’ అని సూసైడ్ నోట్లో ఇంగ్లీష్లో రాసి డాక్టర్ గౌరవ్ కుమార్ గుప్తా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఈ హై ప్రొఫైల్ కేసును అన్ని కోణాన్ని విచారిస్తున్నారు. గౌరవ్ గుప్తా సూసైడ్ నోట్ ఆధారంగా అతని భార్యను, మామను, మరదలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Doctors, Husban commits suicide, Madhya pradesh