సంచలనం రేపిన పృథ్వీరాజ్ ఆడియో టేప్ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ ముందుకు సాగడం లేదు. పృథ్వీపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావడం లేదు. పృథ్వీరాజ్ వ్యవహాంపై సమాచారం ఇస్తున్నప్పటికీ కంప్లైట్ చేసేందుకు మాత్రం వెనకాడుతున్నారు. ఇక ఆయనతో ఫోన్ సంభాషణలో మాట్లాడిన మహిళ కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు. మీడియాకు సైతం ముఖం చాటేస్తోంది. తాను ఇప్పటికే అల్లరిపాలై ఇబ్బందులు పడుతున్నానని.. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల చుట్టూ తిరిగలేనని ఆమె చెప్పినట్లు సమాచారం. దాంతో విజిలెన్స్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఫోన్ ఆడియోతో కేసును ముందుకు తీసుకెళ్లలేమని చెబుతున్నారు. బాధితులు ముందుకు రాకుంటే ఆరోపణలు నిరూపించడం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.
30 ఇయర్స్ పృథ్వీరాజ్ ఇటీవల తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఎస్వీబీసీ ఛైర్మన్గా ఉన్న ఆయన.. ఓ మహిళా ఉద్యోగినితో సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని తాను కోరుకుంటున్నట్టు, కౌగించుకుందామని అనుకున్నట్టు చెప్పిన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణల ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పృథ్వీ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పృథ్వీ ఆడియో టేప్పై నిగ్గు తేల్చేందుకు టీటీడీ విజిలెన్స్ విచారణ జరుపుతోంది. ఐతే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రాకపోవడంతో విచారణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prudhvi Raj, Svbc, Tirumala news, Tirupati