news18-telugu
Updated: October 1, 2020, 7:58 AM IST
ప్రతీకాత్మక చిత్రం
తండ్రి వివాహేతర సంబంధం పెట్టకున్న మహిళను నిలదీసిన ఓ నిండు గర్భిణి హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన బుధవారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని వైఎస్సార్ నగర్లో చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం... వైఎస్సార్ నగర్ చెందిన వెంకటరాముడు, భారతి దంపతులు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దురు కూతుళ్లు కాగా, పెద్ద కూతురును భీమరం గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. రెండో కూతురు లక్ష్మిదేవికి రెండేళ్ల కిందట మునిస్వామితో వివాహం అయింది. పెళ్లి అనంతరం వీరిద్దరు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల లక్ష్మిదేవికి నెలలు నిండటంతో కాన్పుకోసం పుట్టింటికి వచ్చింది. అయితే వెంకటరాముడు అదే కాలనీకి చెందిన సుశీల అనే మహిళతో కొంతకాలంగా వివాహేతరం సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయంపైనే భారతి, లక్ష్మిదేవిలు చాలా ఆవేదనతో రగిలిపోయారు. ఇందుకు సంబంధించి వారిద్దరు బుధవారం సుశీలను మందలించారు. ఆ సమయంలో సుశీల.. భారతితో పాటు లక్ష్మిదేవితో ఘర్షణకు దిగింది. వీరి మధ్య ఘర్షణ పెద్దదిగా మారింది. ఈ క్రమంలో లక్ష్మిదేవి మెడలో ఉన్న తాళి గొలుసు తెంపేసిన సుశీల దాన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుంది. దీంతో లక్ష్మిదేవి తన తాళి కోసం సుశీల ఇంట్లోకి వెళ్లేందుకు చూసింది. అందులో భాగంగానే తలుపులు తోసేసింది.. దీంతో సుశీల ఒక్కసారి పదునైన కత్తితో లక్ష్మిదేవిపై దాడి చేసింది. అసలే గర్బిణిగా ఉన్న లక్ష్మిదేవి కడుపుపై కత్తిపోట్లు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది గమనించిన స్థానికులు సుశీల చేతిలో కత్తిని లాక్కున్నారు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. లక్ష్మిదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Published by:
Sumanth Kanukula
First published:
October 1, 2020, 6:37 AM IST