చెన్నై: సమాజంలో కొందరు మనుషులకు ఏదో ఒక మత్తులో మునిగితేలడం అలవాటుగా మారింది. వారి చెడు వ్యసనాల కారణంగా ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఆ మత్తులో పడి ఎదుటి వారి జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కాపురాలను చేజేతులా పాడు చేసుకుంటుంటే.. మరికొందరు మద్యం మత్తులో పడి బంగారం లాంటి సంసారాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అలాంటి ఓ మత్తులో మునిగిన ఓ వ్యక్తి చేసిన దారుణం ఇది. తమిళనాడులో భానుప్రియ, విఘ్నేష్ అనే దంపతులు నివాసముంటున్నారు. కొన్నేళ్ల క్రితం వీరికి వివాహమైంది. విఘ్నేష్ గవర్నమెంట్ బస్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. భానుప్రియ విరుధునగర్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. పెళ్లయిన కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ.. కొన్ని నెలల నుంచి భానుప్రియ జీవితం కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. విఘ్నేష్ ఉద్యోగం మానేశాడు. భార్యతో గొడవ పడుతూ ఆమెను ఇబ్బంది పెట్టసాగాడు. ఉద్యోగం మానేసినప్పటికీ భానుప్రియ తన సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అయినప్పటికీ విఘ్నేష్ తీరు మారలేదు. రోజూ తాగొచ్చి భార్యను ఇబ్బందిపెట్టేవాడు. చీటికీమాటికీ గొడవ పడుతుండేవాడు. భార్యతో ప్రేమగా మాట్లాడటమే మానేశాడు. కొన్ని నెలల నుంచి భర్త ప్రవర్తనతో భానుప్రియ తీవ్ర మనస్తాపం చెందింది. కానీ.. ఇద్దరు పిల్లల భవిష్యత్ బాగుండాలని.. భర్త సంపాదించినా.. సంపాదించకపోయినా సహిస్తూ ముందుకు సాగింది.
విఘ్నేష్ చివరికి ఏ స్థితికి దిగజారాడంటే.. ఆమె ఇంట్లో దాచుకున్న డబ్బులతో మద్యం తాగొచ్చేవాడు. కుటుంబాన్ని పట్టించుకోవడమే మానేశాడు. బాధ్యత లేకుండా ప్రవర్తించడమే కాకుండా తల్లీపిల్లలను తిడుతూ.. కొడుతూ హింసించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే.. ఇటీవల ఒకరోజు రాత్రి తాగి ఇంటికొచ్చిన విఘ్నేష్.. మళ్లీ తాగడానికి డబ్బులివ్వాలని భార్యను అడిగాడు. ఆమె ఇవ్వనని చెప్పడంతో ఆమెతో గొడవపెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య ఈ విషయంలో పెద్ద గొడవ జరిగింది. పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇలా డబ్బులన్నీ తాగి తగలేస్తే వారి చదువుల సంగతేంటని భార్య విఘ్నేష్ను నిలదీసింది. ఈ పరిణామంతో మరింత కోపోద్రేకంతో ఊగిపోయిన విఘ్నేష్ భార్యపై చేయి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా.. భానుప్రియ డ్యూటీకి వెళ్లే సమయంలో ధరించే బెల్ట్ను ఆమె గొంతుకు బిగించాడు. పిల్లలు ఏడుస్తూ.. అమ్మనేం చేయొద్దని బతిమలాడినా విఘ్నేష్ పట్టించుకోలేదు.
భానుప్రియ గొంతుకు ఆమె బెల్ట్ను బలంగా బిగించడంతో ఊపిరాడక కొంతసేపటికి ఆమె స్పాట్లోనే చనిపోయింది. పిల్లల ఏడుపులు వినిపించడంతో ఏమైందోనని.. ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి చూడగా భానుప్రియ అచేతన స్థితిలో కనిపించింది. ఆమె మెడకు బెల్ట్ ఉంది. ఒక మూలన కూర్చుని విఘ్నేష్ కనిపించాడు. భానుప్రియను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు విఘ్నేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భానుప్రియ మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. ఆమెను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నాడని.. ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేశాడని విఘ్నేష్ను స్థానికులు తిట్టిపోశారు. మద్యానికి బానిసై మృగంలా ప్రవర్తించిన విఘ్నేష్కు కఠినంగా శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, Crime news, Husband kill wife, Married women, Tamilnadu