తిరుప్పూర్: తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో పెళ్లయిన మరుసటి రోజే నవ వధువు భర్తకు ఊహించని షాకిచ్చింది. పెళ్లి జరిగిన తర్వాత రోజే నగలతో ఉడాయించింది. దీంతో.. తాను మోసపోయినట్లు గ్రహించిన ఆ పెళ్లి కొడుకు భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుప్పూర్ జిల్లాలోని గుణ్ణతూరుకు చెందిన రాజేంద్రన్ వయసు 34. తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేస్తూ రాజేంద్రన్ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లి కోసం రాజేంద్రన్ చేయని ప్రయత్నాలు లేవు. ఉద్యోగం చేసే వరుడి కోసం చూస్తున్న ఈరోజుల్లో రాజేంద్రన్ వ్యవసాయం చేస్తూ ఊళ్లోనే ఉండిపోవడంతో అతనికి వధువు దొరకడం కష్టంగా మారింది. కొడుకుకు పెళ్లి చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు పడుతున్న బాధను చూడలేక రాజేంద్రన్ చివరి ప్రయత్నంగా సిరువళ్లూరుకు చెందిన చంద్రన్ను కలిసి తనకు తగిన సంబంధం తీసుకురావాల్సిందిగా కోరాడు.
అప్పుడు చంద్రన్ రాజేంద్రన్కు అంబికా అనే మహిళా మధ్యవర్తిని పరిచయం చేశాడు. అంబికా కూడా రాజేంద్రన్కు వల్లైమల్ అనే మరో మహిళా మధ్యవర్తిని పరిచయం చేసింది. ఊళ్లో ఉన్నప్పటికీ రాజేంద్రన్ ఆస్తిపరుడే. చెప్పుకోదగ్గ పొలం, డబ్బు ఉన్నాయి. ఈ సంగతి తెలుసుకున్న వల్లైమల్ రాజేంద్రన్కు ఓ సంబంధం ఉందని చెప్పింది. తన నిరీక్షణ ఫలించిందని రాజేంద్రన్ భావించాడు. ఆమెను వెంటనే చూద్దామని ఆమెకు చెప్పడంతో రాజేంద్రన్ వధువును చూసేందుకు ఆ మహిళా మధ్యవర్తితో కలిసి వెళ్లాడు. సెప్టెంబర్ 2న పెళ్లి చూపులకు వెళ్లాడు. అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆమె కూడా రాజేంద్రన్ను ఇష్టపడటంతో వీలైనంత తొందరగా పెళ్లి చేయాలని రాజేంద్రన్ తల్లిదండ్రులు భావించారు. ఈ పెళ్లి సంబంధం కుదిర్చినందుకు సదరు మధ్యవర్తికి కమీషన్గా లక్షా 30 వేలు రాజేంద్రన్ చెల్లించాడు.
గత నెలలో రాజేంద్రన్.. రీసా అనే ఆ యువతిని ఓ ఆలయంలో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తనకు నచ్చిన అమ్మాయితో జీవితం మొదలైందని భావించిన రాజేంద్రన్ ఆశలు ఆవిరి కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. పెళ్లయిన మరుసటి రోజే రాజేంద్రన్ కుటుంబం చేయించిన బంగారు నగలతో రీసా అక్కడి నుంచి ఉడాయించింది. రాజేంద్రన్ కారులో వెళ్లిపోయింది. తాను మోసపోయానని గ్రహించిన రాజేంద్రన్ ఈ సంబంధం కుదిర్చిన బ్రోకర్స్కు ఫోన్ చేశాడు. స్విచాఫ్ వచ్చింది. రాజేంద్రన్ ఆ యువతిని చూసేందుకు వెళ్లిన ఊరికి వెళ్లి ఆరా తీయగా షాకింగ్ నిజం బయటపడింది. రీసాకు అప్పటికే జైశ్రీధర్ అనే వ్యక్తితో పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తేలింది. ఈ నిజం తెలిసి షాకయిన రాజేంద్రన్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ కేసులో 27 ఏళ్ల రీసాను, అంబిక, వల్లైమల్, రీసా కజిన్స్ అయిన తంగం, దేవిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Jewellery, Marriage, Tamilnadu