దాదాపు సగం జిల్లాకు గౌరవ మెజిస్ట్రేట్ ఆయన.. పది,పదిహేను మంది మండల మెజిస్ట్రేట్లు అంటే, తహసీల్దార్లకు బాస్. అంతేనా, ఉత్తర తెలంగాణలో కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ కు ఇంచార్జి కమిషనర్ కూడా. కటింగ్స్ పోను నెల జీతమే లక్షల్లో అందుతుంది. ఉన్నతాధికారి కాబట్టి సారుకు కారు బంగళా, నౌకర్లు, చాకర్లు.. సకల వసతులు కల్పిస్తుంది ప్రభుత్వం. నిజాని ఆ స్థాయిని చేరుకోడానికి ఆయన కష్టపడి చదువుకొని ఉండొచ్చు. కానీ ఏం లాభం? లంచాలకు మరిగి ప్రజల్లో విలువ పోగొట్టుకున్నాడు.. కాసుల కకృతి పడి చివరికి కటకటాలపాలయ్యాడు. ఆ లంచావతారాకి మరో పేరు భోళా శంకర్.. లక్ష లేనిదే పెన్ను కదలదు.. అలా క్యాష్ కొడితే.. ఇలా చెక్కు మీద సంతకాలు పెట్టేస్తారు. అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులు చెప్పిన వివరాలివి..
పెద్దపల్లి జిల్లాలో టాప్ మోస్ట్ అధికారి అరెస్టు.. రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీవో) శంకర్ కుమార్ లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. కరోనా సమయంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో కాం ట్రాక్టర్ రజనీకాంత్ శానిటేషన్ పనులు చేశారు. ఇందుకు గాను అతనికి రెండు బిల్లులు రూ. 9,28,796లు రావాల్సి ఉన్నది. కాగా పెద్దపల్లి ఆర్డీవో శంకర్కుమార్ గత నాలుగు నెలలుగా రామగుండం కార్పొరేషన్కు ఇంచార్జి కమిషనర్ కొనసాగుతున్నారు. బిల్లుల చెల్లింపు కోసం కాం ట్రాక్టర్ పలుమార్లు ఇంచార్జి కమిషనర్ను కలిశా రు.
రూ.లక్ష లంచం ఇస్తేనే బిల్లులు చేయిస్తానని చెప్పడంతో రజనీకాంత్ ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం ఆయన పెద్దపల్లి ఆర్డీవో క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆర్డీవో తన ఇంట్లో పనిచేసే హనుమకొండకు చెందిన తోట మల్లికార్జున్కు ఇవ్వాలని సూచించడంతో అతనికి రూ.లక్ష ఇచ్చారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దాడి చేసి డబ్బులను రికవరీ చేసుకొన్నారు. ఆర్డీవో శంకర్కుమార్తోపాటు ఆయన సహాయకుడు తోట మల్లికార్జున్ను అదుపులోకి తీసుకొన్నారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో కలెక్టర్ తర్వాతి స్థానంలో ఉండే ఆర్డీవో ఇలా లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన ఘటన సంచలనం రేపింది. కాగా, అవినీతి ఆర్డీవోను బుధవారం కరీంనగర్లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు,
పెద్దపల్లి జిల్లాలో రెవెన్యూ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ దొరికిపోగా, నాగర్ కర్నూలు జిల్లాలో అదే రెవెన్యూ శాఖలోని చిరుద్యోగి తన చేతివాటం చూపించి బుక్కైపోయాడు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపూర్కు చెందిన సంకెళ్ల రాము అనే వ్యక్తి తన తల్లి పేరిట ఉన్న ఇంటిని తన పేరుమీదకు మ్యుటేషన్ చేయాలని పంచాయితీ కార్యదర్శి రామస్వామికి దరఖాస్తు చేసుకున్నారు. రూ.5,500 లంచం ఇస్తేనే మ్యుటేషన్ చేస్తానని కార్యదర్శి చెప్పాడు. ఈ మేరకు మంగళవారం గ్రామం లో పంచాయతీ కార్యదర్శి రామస్వామి.. రాము నుంచి రూ.5,500 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ACB, Peddapalli, PEDDAPALLI DISTRICT, Telangana News