పాకిస్థాన్లోని లాహోర్ లో మరోసారి బాంబు కలకలం రేగింది. లాహోర్లోని డేటా దర్బార్ అనే ఓ దర్గా వద్ద ఈ రోజు ఉదయం బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. దీనిపై స్థానిక పోలీస్ మొహమ్మద్ కసీఫ్ మాట్లాడుతూ.. భద్రతా దళాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని భావిస్తున్నామని అన్నారు. దీనిపై దర్యాప్తును చేస్తున్నామని వెల్లడించారు. బాంబు పేలుడు ధాటికి రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టామని, మృతదేహాలను పోస్ట్మార్టానికి ఆస్పత్రికి తరలించామని చెప్పారు.
కాగా, ఈ దారుణానికి పాల్పడింది ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులో తెలియరాలేదని అక్కడి పోలీసులు తెలిపారు. 2010లోనూ ఇక్కడ ఉగ్రదాడి జరగ్గా.. ఆ ఘటనలో 40మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb blast, Pakistan, Police, Terrorism