news18-telugu
Updated: November 9, 2020, 11:20 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఓ కొత్త జంట పెళ్లి చేసుకుని రెండు రోజులైనా గడవలేదు.. అంతలోనే వధువు కిడ్నాప్ కావడం కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి నవవధువును కిడ్నాప్ చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని పొరండ్ల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన వేముల రాకేశ్, సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన కొంపల సమత ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 7న మల్యాల మండలం ఒబులాపూర్ వీరభద్రస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అదే రోజు తమకు రక్షణ కావాలంటూ నూతన జంట సారంగాపూర్ పోలీసులను ఆశ్రయించారు.
దీంతో పోలీసులు రాకేశ్, సమత తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం నూతన దంపతులు పొరండ్లలోనే కాపురం పెట్టారు. అయితే తొలి నుంచి రాకేష్ను సమత పెళ్లి చేసుకోవడం నచ్చని ఆమె కుటుంబ సభ్యులు దీనిని జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యహ్నం సమత సోదరుడు సాయికుమార్తోపాటు మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బుర్రల ప్రవీణ్తో సహా మరో నలుగురు పొరండ్ల గ్రామానికి చేరుకుని రాకేశ్, అతని కుటుంబ సభ్యులపై దాడిచేసి సమతను బలవంతంగా కారులో తీసుకెళ్లారు.
సమతను ఆమె సోదరుడు తీసుకెళ్లిపోవడంతో.. రాకేష్ పోలీసులను ఆశ్రయించాడు. తన భర్తను ఆమె సోదరుడు తీసుకెళ్లిపోయాడని జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 9, 2020, 11:15 PM IST